కలవరం వదలదా! | - | Sakshi
Sakshi News home page

కలవరం వదలదా!

Jul 10 2026 7:58 AM | Updated on Jul 10 2026 7:58 AM

సాక్షి, అమలాపురం: వరదల సీజన్‌ రానే వచ్చింది.. వెంటే గుబులు తెచ్చింది.. అనుకోని ఘటన ఎదురైతే, ఎదుర్కొనేందుకు మాత్రం ప్రభుత్వ సన్నద్ధత కానరాకుంది.. వరద నియంత్రణకు ఏర్పాటైన ఫ్లడ్‌ స్టోర్స్‌ను చూస్తే, అది ఇట్టే అర్థమవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఐదు సెంట్రల్‌ ఫ్లడ్‌ స్టోర్స్‌, 15 శాశ్వత, 14 అదనపు ఫ్లడ్‌ స్టోర్స్‌ ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. ఏటిగట్లకు గండ్లు పడినా, ప్రమాదకర పరిస్థితులు తలెత్తినా తక్షణం స్పందించి, తగిన రక్షణ చర్యలు చేపట్టేందుకు ఇవి ఎంతో కీలకం. ఇక్కడ వరద నియంత్రణ సామగ్రి పూర్తిగా సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నా, వాస్తవంగా ఉండాల్సిన స్థాయిలో ఖాళీ సిమెంట్‌ సంచులు, వెదురు బొంగులు, సర్వే బాదులు, టార్చిలైట్లు లేవు. చాలా ఫ్లడ్‌ స్టోర్స్‌ భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వరదల వేళ ఇలాంటి పరిస్థితిపై జనం భయం గుప్పెట్లో జీవనం సాగించాల్సిన పరిస్థితి దాపురించింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉందో ‘సాక్షి’ పరిశీలించింది. ఆ చిత్రాల సమాహారమే ఇది.

ఎందు‘కూలే’ అన్నట్టు..

పి.గన్నవరంలో వైనతేయ నదిని ఆనుకుని ఉన్న పి.గన్నవరం ఫ్లడ్‌ స్టోర్‌ ఇది. వైనతేయ ఎడమ గట్టుపై ఏకై క ఈ పర్మినెంట్‌ ఫ్లడ్‌ స్టోర్‌ భవనం బీటలు వారింది. కూలేందుకు సిద్ధంగా ఉంది. గన్నవరం అక్విడెక్టు నుంచి నాగుల్లంక వరకు (రాజోలు దీవిలో) ఏటిగట్టు నిర్మించలేదు. వరద వస్తే ఈ ప్రాంతం మునిగిపోతోంది. పాత అక్విడెక్టు పైనుంచి వరద పారుతోంది. ఇంతటి ప్రమాదకరమైన ప్రాంతంలో ఫ్లడ్‌ స్టోర్‌ దుస్థితి ఇలా ఉంది.

కు‘సంచి’పోయి..

గౌతమీ నది కుడిగట్టుపై ఉన్న కోటిపల్లి సెంట్రల్‌ ఫ్లడ్‌ బ్యాంకు ఇది. ఇక్కడ సర్వే బాదులు, వెదురు కర్రలు ఉన్నాయి. అయితే ఖాళీ సిమెంట్‌ సంచులు మాత్రం కనిపించడం లేదు. పక్కా భవనం లేక తాత్కాలికంగా రేకుల షెడ్‌ వేసి అనేక ఏళ్లుగా నెట్టుకొస్తున్నారు. అత్యంత కీలకమైన ఈ ప్రాంతంలో పక్కా భవనం లేకపోవడం గమనార్హం.

ఉమ్మడి జిల్లాలో ఫ్లడ్‌ స్టోర్స్‌ ఇవే..

చిన్నచూపు సరికాదు

2008లో వైఎస్సార్‌ హయాంలో రూ.650 కోట్లతో ఏటిగట్లను పటిష్టం చేశారు. 1986 ఆగస్టు 16న గోదావరికి వచ్చిన 35 లక్షల క్యూసెక్కుల అతి పెద్ద వరదను ప్రమాణంగా తీసుకుని, నాటి వరద ప్రవాహానికి అదనంగా ఏటిగట్ల ఎత్తును 2 మీటర్లు, టాప్‌ వెడల్పును 6.5 మీటర్లు పెంచారు. గట్లను పటిష్టం చేసిన తర్వాత నీటిపారుదల శాఖ అధికారులు ఫ్లడ్‌ స్టోర్స్‌పై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కీలకమైన ప్రాంతాల్లో గట్ల పటిష్ట పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్న విషయాన్ని ఇప్పుడున్న అధికారులు మరిచిపోతున్నారు. ఫ్లడ్‌ స్టోర్స్‌ నిర్వహణపై చిన్నచూపు తగదు.

– విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్‌,

విశ్రాంత సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌,

ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌

ఎందుకూ కొరగాకుండా ఫ్లడ్‌ స్టోర్స్‌

పూర్తి స్థాయిలో కానరాని సామగ్రి

కనీస నిర్వహణను వదిలేసిన ప్రభుత్వం

గోదావరి వరదల సీజన్‌

వచ్చినా నిర్లక్ష్యమే

దారిదాపుల్లోకి వెళ్లలేం..

ఒకవైపు గౌతమీ లెఫ్ట్‌ బ్యాంకు.. మరోవైపు వశిష్ఠ రైట్‌ బ్యాంకు.. ఆత్రేయపురం మండలానికి రెండు వైపులా నదీపాయలు ప్రవహిస్తున్నాయి. ఈ మండలంలో ఉన్న ఒకే ఒక ఫ్లడ్‌ స్టోర్‌ ర్యాలి (లొల్ల సమీపంలో ఉంది). భవనం శిథిలావస్థలో ఉండగా, ఇక్కడకు వెళ్లేందుకు సరైన రహదారి కూడా లేదు. స్థలం లేకపోవడంతో ఫ్లడ్‌ స్టోర్‌ ముందే ఇసుక బస్తాలు వేసి వదిలేశారు.

సెంట్రల్‌ ఫ్లడ్‌ స్టోర్స్‌

అఖండ గోదావరి లెఫ్ట్‌ బ్యాంకు:

రాజమహేంద్రవరం

గౌతమీ లెఫ్ట్‌ బ్యాంకు:

కపిలేశ్వరపురం, కోటిపల్లి

గౌతమీ రైట్‌ బ్యాంకు: ర్యాలి, అన్నంపల్లి

పీఏపీ (ఐ.పోలవరం): మురమళ్ల

వశిష్ఠ లెఫ్ట్‌ బ్యాంకు: రాజోలు

పర్మినెంట్‌ ఫ్లడ్‌ స్టోర్స్‌

అఖండ గోదావరి లెఫ్ట్‌ బ్యాంకు:

ధవళేశ్వరం, ముగ్గళ్ల

గౌతమీ లెఫ్ట్‌ బ్యాంకు:

వేమగిరి, కపిలేశ్వరపురం, మసకపల్లి

కోరంగి ఐలాండ్‌ ప్రాజెక్టు: తాళ్లరేవు (నీలపల్లి)

గౌతమీ రైట్‌ బ్యాంకు: పేరవరం,

మెర్లపాలెం, చింతనలంక

వశిష్ట లెఫ్ట్‌ బ్యాంకు: కట్టుంగ,

గోపాలపురం, సఖినేటిపల్లి

వైనతేయ లెఫ్ట్‌ బ్యాంకు:

పి.గన్నవరం, బోడసకుర్రు

వైనతేయ రైట్‌ బ్యాంకు: పాశర్లపూడి

అదనపు ఫ్లడ్‌ స్టోర్స్‌

అఖండ గోదావరి లెఫ్ట్‌ బ్యాంకు:

వెంకటనగరం, వంగలపూడి,

పురుషోత్తపట్నం

గౌతమీ లెఫ్ట్‌ బ్యాంకు: ఆలమూరు

గౌతమీ రైట్‌ బ్యాంకు: వానపల్లి, పల్లంకుర్రు, రావులపాలెం, పీఏపీ ఎదుర్లంక

వశిష్ఠ లెఫ్ట్‌ బ్యాంకు: నాగుల్లంక,

రాజవరం, పొడగట్లపల్లి

వైనతేయ లెఫ్ట్‌ బ్యాంకు: కఠారులంక,

కోరంగి ఐలాండ్‌ ప్రాజెక్టు:

కాకినాడ, నీలపల్లి

రక్షణ.. అదెక్కడ!

అఖండ గోదావరి లెఫ్ట్‌ బ్యాంకు (ఏజేఎల్‌బీ) సెంట్రల్‌ ఫ్లడ్‌ స్టోర్‌ భవనం ఇది. ఇందులోనే అసిస్టెంట్‌ ఇంజినీర్‌ కార్యాలయం ఉంది. ఏజేఎల్‌బీ ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి పురుషోత్తపట్నం వరకూ సుమారు 40.80 కి.మీ పొడవు. ఇంత పొడవైన ఏటిగట్టును రక్షించే సామగ్రి ఉంచే ఫ్లడ్‌ స్టోర్‌ భవనం దుస్థితి ఇది. ఇక్కడ కనీస వరద రక్షణ సామగ్రి లేదని స్థానికులు చెబుతున్నారు. ధవళేశ్వరం ఎస్‌ఈ కార్యాలయానికి దగ్గరగా ఉన్న ఫ్లడ్‌ స్టోర్‌ పరిస్థితి ఇలా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement