దేవీపట్నం: ఎగువ నుంచి పోటెత్తుతున్న వరద కారణంగా దేవీపట్నం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. వరద నీరు గండిపోశమ్మ ఆలయంలోకి, సమీప దుకాణాల్లోకి చేరింది. దండంగి, డి.రావిలంక గ్రామాల మధ్య రహదారిపై భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దండంగి వాగులోకి గోదావరి బ్యాక్ వాటర్ పోటెత్తడంతో చినరమణయ్యపేట, దండంగి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గండిపోశమ్మ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు ప్రకటించారు. ఆలయానికి భక్తులు రావద్దని విజ్ఞప్తి చేశారు. పోశమ్మ గండికి వెళ్లే మార్గాలన్నీ మూతపడ్డాయి. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి వచ్చే రహదారిని పోలవరం ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే మూసివేశారు.


