రంపచోడవరం: గిరిజనులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న పులిని అటవీ అధికారులు బంధించి, వేరే ప్రాంతానికి తరలించాలని ఏపీ ముఖ్యకార్యదర్శి, వైల్డ్ లైఫ్ ఉన్నతాధికారులకు హ్యూమన్ రైట్స్ వాచ్ గ్లోబల్ డైరెక్టర్ బాలు అక్కిస ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కుర్మాపురం గ్రామంలో పులి బంధించి పాపికొండలు అభయారణ్యంలో వదలిన తరువాత, అక్కడ నుంచి పులి తిరిగి రంపచోడవరం మండలం పెదపాడు, పెద్దకొండలో ఆవులపై దాడి, తాళ్లపాలెం గ్రామంలో ఒక దూడను చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై హ్యూమన్ రైట్స్వాచ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ కొన్ని ప్రాంతాలను సందర్శించిందని బాలు అక్కిస మంగళవారం చెప్పారు. దీనిలో కొన్ని అంశాలు తమ దృష్టికి తీసుకువచ్చాయన్నారు. సుమారు రెండు నెలల క్రితం పాముగండి, ఆకూరు, మరికొన్ని గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు సమావేశాలు పెట్టి, పాపికొండలు నేషనల్ పార్కు ఎకో సెన్సిటీవ్ జోన్ ఏర్పాటులో భాగంగా గ్రామాలను ఖాళీ చేయాలని, గ్రామసభల తీర్మానాలు ఇవ్వాలని గిరిజనులను అడిగినట్లు తెలిపారు. అడవే ఆధారంగా తాము బయటకు వెళ్లేందుకు సిద్ధంగా లేమని గ్రామసభ తీర్మానాలు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే పాపికొండలు నేషనల్ పార్కు ఎకో సెనిసటీవ్ జోన్ ఏర్పాటును రద్దు చేయాలని తీర్మానించారన్నారు. తమకు అనుకూలంగా తీర్మానాలు చేయకపోవడంతోనే కక్ష పూరితంగా కుర్మాపురంలో పట్టుకొన్న పులిని కొండమొదలు ప్రాంతంలో ఎక్స్ప్లోరర్ అనే పేరుతో వదలిపెట్టినట్లు ఆయన ఆరోపించారు. పులికి భయపడి గిరిజనులు గ్రామాలు ఖాళీ చేస్తారని అటవీ అధికారులు అంచనాలో భాగంగానే ఇదంతా జరుగుతోందన్నారు. నిజానికి పులి అడవులను వదలి జనారణ్యంలోకి వస్తే బంధించి జూలో పెట్టాలని లేదా పులుల ఉన్న అభయ అరణ్యంలో వదలిపెట్టాలన్నారు.


