
వరద గోదావరి
రాజోలులో వశిష్ట గోదావరి తీరంలో మునిగిన పార్కు
సాక్షి, అమలాపురం: లంక గ్రామాలను గోదావరి వరద చుట్టుముడుతోంది. ఏటిపట్టు వాసులు, లంక ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. పలు లంక గ్రామాల్లో రోడ్లు, కల్వర్టులు, కాజ్వేలు ముంపు బారిన పడడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా పడవులు, ట్రాక్టర్లపై రాకపోకలు సాగిస్తున్నారు. రైతులు పంట ఉత్పత్తులు, పశువులను తరలించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. పశువులను పల్లపు ప్రాంతాల నుంచి ఏటిగట్ల మీదకు తరలించి కాపాలా కాస్తున్నారు. అయితే పశుగ్రాసం పూర్తిస్థాయిలో లేక పశువుల మేపేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థులు పడవులు దాటి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాల్సి వస్తోంది. మత్స్యకార నివాసాల చుటూ వరద నీరు చేరడంతో ఇక్కట్లు పాలవుతున్నారు.
లంక వాసుల్లో ఆందోళన
గోదావరి ఊగ్రరూపం దాల్చుతుందని కోనసీమ జిల్లా లంక వాసులు ఆందోళన చెందుతున్న సమయంలో ఎగువన శాంతిస్తుండడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండడంతో అప్రమత్తంగా ఉన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో 13,57,119 క్యూసెక్కులను దిగువకు వదిలారు. తర్వాత రెండు గంటల పాటు నిలకడగా ఉన్న వరద మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి తగ్గుముఖం పట్టింది. సాయంత్రం ఏడు గంటల సమయానికి 13,48,226 క్యూసెక్కుల జలాలు విడిచిపెట్టారు.
పెరుగుతున్న ఉధృతి
ఎగువన శాంతిస్తున్నా కోనసీమలో మాత్రం రాత్రి వరకూ వరద ముంపు పెరుగుతూనే ఉంది. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల్లో వరద ప్రభావంతో పలు లంక గ్రామాల్లో వరద నీరు చేరింది. గ్రామాలకు వెళ్లే రహదారులు నీట మునిగాయి. నిత్యావసర సరకులు, తాగునీటికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పడవలపై బయట గ్రామాలకు వచ్చి సరకులు తీసుకువెళ్తున్నారు.
ముంపులో పంటలు
లంక భూముల్లోని పంటలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. కూరగాయ పంటలు, బొప్పాయి, ఎర్ర చక్రకేళి, కంద వంటి వాణిజ్య పంటలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. లంకల్లోని వ్యవసాయ ఉత్పత్పులు, పాల క్యాన్లను రైతులు పడవలపై బయటకు తీసుకు వస్తున్నారు. మధ్య లంకలు వరద నీట మునగడంతో పాడి రైతులు పశువులను ఏటిగట్లపైకి తరలించారు. పశు గ్రాసానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పి.గన్నవరం ఊడిమూడి ఏటిగట్టు దిగువన గుడిసెలు నీట మునిగాయి. ఇక్కడ సంచార జాతి బాధితులు ఇళ్లు వదిలి ఏటిగట్ల మీద తాత్కాలిక గుడారాలు వేసుకున్నారు. ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అల్లవరం, మామిడికుదురు, సఖినేటిపల్లి మండలాల్లోని లోతట్టు ప్రాంతాలలో నివాసముండే మత్స్యకార ప్రాంతాలు నీట మునిగాయి. ఇక్కడ సుమారు 700 మత్స్యకార కుటుంబాలు నివాసం ఉంటున్నాయని అంచనా. వీరంతా నదీపాయల్లో పడవల మీద వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
అయినవిల్లి మండలం ముక్తేశ్వరం– అయినవిల్లిలంక కాజ్వే పై ఉధృతిగా ప్రవహిస్తున్న వరద
కుండలేశ్వరం పుష్కర ఘాట్ వద్ద రావిచెట్టు వద్దకు చేరిన నీరు
పి.గన్నవరం అక్విడెక్టు వద్ద వరద ఉధృతి
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీటి విడుదల
సమయం నీటి విడుదల
(క్యూసెక్కులలో)
తెల్లవారుజాము 3 గంటలు 12,85,832
తెల్లవారుజాము 4 గంటలు 13,00,000
ఉదయం 5 గంటలు 13,05,404
ఉదయం 6 గంటలు 13,14,214
ఉదయం 7 గంటలు 13,22,659
ఉదయం 8 గంటలు 13,31,507
ఉదయం 9 గంటలు 13,31,507
ఉదయం 10 గంటలు 13,31,507
మధ్యాహ్నం 12 గంటలు 13,42,773
మధ్యాహ్నం 1 గంటలకు 13,51,272
మధ్యాహ్నం 2 గంటలు 13,57,119
మధ్యాహ్నం 3 గంటలు 13,57.119
మధ్యాహ్నం 4 గంటలు 13,57,119
సాయంత్రం 6 గంటలు 13,51,272
సాయంత్రం 7 గంటలు 13,48,226
లంక గ్రామాలను
చుట్టుముట్టిన వరద
మునిగిన కాజ్వేలు
మత్స్యకార కాలనీల్లోకి చేరిన నీరు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు

వరద గోదావరి

వరద గోదావరి

వరద గోదావరి