
కంచితో మంచి అనుబంధం
● వీర వేంకట సత్యనారాయణ స్వామి స్వయంభువుగా వెలసిన అన్నవరం దేవస్థానానికి, కంచి కామకోటి పీఠానికి ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. రత్నగిరిపై సత్యదేవుడు ఆవిర్భవించి 134 సంవత్సరాలు పూర్తి కాగా అప్పటి నుంచీ దేవస్థానంలో వైదిక కార్యక్రమాల రూపకల్పన, ప్రతి కీలక పరిణామాల్లో కంచి కామకోటి పీఠాధిపతులు సూచనలు అందిస్తున్నారు. వారు భక్తులకు, దేవస్థానం అధికారులకు ఇస్తున్న సూచనలు, అనుగ్రహ భాషణలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
● నడిచే దేవుడిగా పేరొందిన కంచి పీఠం 68వ అధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి సుమారు 50 ఏళ్ల క్రితం కంచి నుంచి పాదయాత్ర చేస్తూ అన్నవరం వచ్చారు. ఆయన కూడా వందల సంఖ్యలో భక్తులతో పాటు ఏనుగులు, గుర్రాలు, ఆవులు కూడా నడుస్తూ వచ్చాయి. అన్నవరంలో ఆయన మూడు రోజులు బస చేశారు. స్థానిక సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయంలో పీఠం ఏర్పాటు చేసి, స్వామీజీ పూజలు చేశారు. ఆ సమయంలో సత్యదేవుని ఆలయానికి వచ్చి, దేవస్థానంలో అనేక వైదిక కార్యక్రమాల గురించి మార్గనిర్దేశం చేశారు. పలువురు పండితులకు అన్నవరంలో ఆయన చేతుల మీదుగా సన్మానం చేశారు. స్వామీజీ అన్నవరం నుంచి పాదయాత్రగా తుని వెళ్తూ, మార్గం మధ్యలో ఎర్రకోనేరు వద్ద సూర్యాస్తమయం కావడంతో అక్కడ సంధ్యావందనానికి ఆగిపోయారని నాడు స్వామీజీతో యాత్రలో పాల్గొన్న అన్నవరం దేవస్థానం వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ తెలిపారు.