అత్తింటి ముందే కోడలు ఆత్మహత్య

Women Committed Suicide In Front Of Aunt House In Chittoor - Sakshi

బైరెడ్డిపల్లె : విభేదాల నేపథ్యంలో తన భర్తను కలిసేందుకు అత్తగారింటికి వచ్చిన మహిళ పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణం చెందింది. శుక్రవారం ఉదయం ఈ సంఘటన మండలంలోని మునిపల్లెలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మునిస్వామి కథనం...గ్రామానికి చెందిన నారాయణరెడ్డి కుమారుడు హరిప్రసాద్‌రెడ్డి,  తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌కు చెందిన ఏకాంబరం కుమార్తె సత్యవాణి(32) బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవారు. వీరి పరిచయం ప్రేమగా మారడంతో గత ఏడాది వివాహం చేసుకున్నారు. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగినప్పటికీ తర్వాత విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా దూరంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 12న గురువారం హరిప్రసాద్‌ను కలిసేందుకు సత్యవతి బెంగళూరు నుంచి ద్విచక్రవాహనంపై మునిపల్లెకు వచ్చింది. అయితే హరిప్రసాద్‌ లేకపోవడంతో అతడిని పిలిపించాలని అత్తమామలను పట్టుబట్టింది.  దీంతో వారు అతడిని పిలిపించడంతో వారి ఎదుటే ఇద్దరూ గొడవ పడ్డారు. దీంతో సత్యవతి క్షణికావేశానికి గురైంది. వస్తూ..వస్తూ..క్యాన్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. ఒక్కసారిగా భగ్గున మంటలు రేగాయి. వాటిని ఆర్పేందుకు ఆమె అత్తమామలు, హరిప్రసాద్, గ్రామస్తులు యత్నించినప్పటికీ ఫలితం శూన్యం. అక్కడికక్కడే సత్యవాణి సజీవదహనమైంది. గ్రామస్తుల సమాచారంతో ఎస్‌ఐ అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top