అమెరికా వెళ్తానన్న భార్య.. హత్య చేసిన భర్త | Women Border In Thallada, Khammam | Sakshi
Sakshi News home page

అమెరికా వెళ్తానన్న భార్య.. హత్య చేసిన భర్త

Mar 4 2021 3:19 AM | Updated on Mar 4 2021 8:47 AM

Women Border In Thallada, Khammam - Sakshi

తల్లాడ: తన మాట వినడం లేదని క్షణికావేశానికి లోనైన భర్త.. భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగంబంజరలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, మృతుల  పెద్దకుమార్తె, మృతురాలి సోదరుడు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు (65), విజయలక్ష్మి (60) దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు చేశారు. పెద్ద కుమార్తె కరీంనగర్‌ జిల్లా రామగుండంలో ఉంటుండగా.. చిన్న కుమార్తె సునీత అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. చిన్న కూతురును చూసేందుకు పదేళ్ల క్రితం దంపతులిద్దరూ అమెరికా వెళ్లి వచ్చారు. మళ్లీ అమెరికా రమ్మని చిన్న కూతురు ఇటీవల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసింది. కూతురిని చూడాలనిపిస్తోంది.. వెళదామని విజయలక్ష్మి చెప్పగా.. భర్త అందుకు నిరాకరించాడు. అయినా.. ఈనెల 15న అమెరికా వెళ్లేందుకు ఆమె టికెట్‌ బుక్‌ చేసుకుంది.

ఈ విషయమై మూడు రోజులుగా ఇద్దరూ గొడవ పడుతున్నారు. భార్య తన మాట వినడం లేదని రగిలిపోతున్న సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు.. ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి విజయలక్ష్మిని కత్తితో అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 7 గంటల సమయంలో పాలు పోసేందుకు వచ్చిన రామకృష్ణారెడ్డి .. ఇద్దరినీ పిలవగా ఎవరూ పలకలేదు. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా.. సుబ్రమణ్యేశ్వర్‌రావు నోట్లో నుంచి నురుగు రావడం.. విజయలక్ష్మి బెడ్‌ రూమ్‌లో పడిపోయి ఉడంటాన్ని చూసి ఇరుగుపొరుగు వారిని పిలిచాడు. కొన ఊపిరితో ఉన్న సుబ్రమణ్యేశ్వర్‌రావును 108 వాహనంలో కల్లూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలాడు. ఖమ్మం అడిషనల్‌ ఎస్పీ స్నేహ మెహ్రా, వైరా ఏసీపీ సత్యనారాయణ, సీఐ జె.వసంత్‌కుమార్, ఎస్‌ఐ వి.సురేశ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. హత్యకు వాడిన కత్తిని, పురుగుల మందు డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement