వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని.. | Wife Murders Husband In Karimnagar | Sakshi
Sakshi News home page

వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని..

Nov 23 2022 7:28 AM | Updated on Nov 23 2022 7:52 AM

Wife Murders Husband In Karimnagar - Sakshi

కౌడిపల్లి(నర్సాపూర్‌): మెదక్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన వ్యక్తి అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. పోలీసులు మూడురోజులలోనే మిస్టరీని ఛేదించారు. కౌడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి మంగళవారం నర్సాపూర్‌ సీఐ షేక్‌ లాల్‌మదార్, ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. కౌడిపల్లి మండలం పీర్లతండా పంచాయతీ కొయ్యగుండ తండాకు చెందిన కాట్రోత్‌ శ్రీను (28) భార్య దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీను ఈనెల 18న రాత్రి పొలానికి వెళ్తున్నాని భార్యకు చెప్పి వెళ్లి ఉదయం శవమై కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద పోలీసులు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. 

స్నేహితురాలు, మరో వ్యక్తి సాయం.. 
మృతుడి భార్య దేవికి తండాలో పలువురితో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయంలో పలుమార్లు భార్యాభర్తలకు గొడవలు జరిగాయి. దీంతో దేవి తన భర్తను చంపాలని నిర్ణయించుకుంది. తండాకు చెందిన ఆమె స్నేహితురాలు రాణి (ఆలియాస్‌ నవీన)తో కలిసి పథకం వేసింది. దీని కోసం కొడుకు వరుసయ్యే పవన్‌కుమార్‌ను సాయం తీసుకుంది. సహకరిస్తే రైతుబీమా డబ్బులు రాగానే రూ.50 వేలు ఇస్తానని ఆశపెట్టింది.  

చెట్టుకు ఉరేసి... 
ఈనెల 18వ తేదీ ఉదయం దేవి, శ్రీను తమ ఇంటి వద్ద జామ చెట్టు విషయంలో పాలివారు కాట్రోత్‌ ధన్‌సింగ్, అతడి కుమార్‌లు సంతోష్, తులసీరాం గొడవ పడ్డారు. ఇదే అదునుగా భావించిన దేవి అదే రోజు రాత్రి  పవన్‌కుమార్‌కు మద్యం ఇప్పించి శ్రీనుకు తాగించాలని చెప్పింది. ఇద్దరూ కలిసి పొలంలో మద్యం తాగారు. రాత్రి దేవి అక్కడికి చేరుకొని మత్తులో ఉన్న శ్రీనును వేప చెట్టుకు ఉరివేశారు. మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి పొలంలో పడేశారు. భర్త చనిపోయాడని పాలివారే చంపేశారని దేవి ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దేవి ప్రవర్తనపై అనుమానం రావడంతో మృతుడి కాల్‌డేటా చెక్‌ చేశారు. దాని ఆధారంగా విచారణ చేపట్టారు.  అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, చంపేస్తే రైతుబీమా, ఎల్‌ఐసీ డబ్బులు వస్తాయన్న ఆశతో హత్యచేసినట్లు ఒప్పుకున్నారు. ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు శాంతి, శోభారాణి, భాగయ్య, శ్రీనివాసులు, పోచయ్యను డీఎస్పీ అభినందించి నగదు రివార్డ్‌ అందజేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement