వైఎస్సార్‌సీపీ ఓటమిని జీర్ణించుకోలేక ముగ్గురు మృతి | Unable to digest YSRCP defeat three died | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఓటమిని జీర్ణించుకోలేక ముగ్గురు మృతి

Jun 29 2024 5:22 AM | Updated on Jun 29 2024 5:22 AM

Unable to digest YSRCP defeat three died

ఎన్టీఆర్‌ జిల్లాలో ఇద్దరు.. కృష్ణా జిల్లాలో ఒకరు.. 

వెల్వడం(మైలవరం)/మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌)/ఉయ్యూరు: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమిని జీర్ణించుకోలేక ఎన్టీఆర్‌ జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు... ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన అయిలూరి శ్రీనివాసరెడ్డి(35) వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి స్థానికంగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండోసారి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బలంగా నమ్మాడు. కానీ, పార్టీ ఓడిపోవడంతో శ్రీనివాసరెడ్డి తీవ్ర మనోవేదనతో కుమిలిపోతున్నాడు. 

ఈ క్రమంలో గురువారం రాత్రి ఆకస్మికంగా మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదేవిధంగా విజయవాడలోని 27వ డివిజన్‌ బావాజీపేటకు చెందిన వైఎస్సార్‌సీపీ గృహసారథి నామా శ్రీను(55) గత 12 ఏళ్లుగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓడిపోయినప్పటి నుంచి బాధపడుతున్న శ్రీను గురువారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నామా శ్రీను మృతికి మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. 

కాగా, కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కడవకొల్లు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ క్రియాశీలక కార్యకర్త, లారీ డ్రైవర్‌ జె.కొండలరావు (56) కూడా పార్టీ ఓటమిని తట్టుకోలేక తీవ్ర వేదనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు వారం రోజుల కిందట గుండెపోటు రావడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. కొండలరావు భౌతికకాయం వద్ద సర్పంచ్‌ మంగినేని సుధారాణి, పార్టీ నాయకులు నివాళులర్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement