రాత్రి నలుగురు యువకులు మాస్కులు ధరించి.. ఇంట్లోకి వెళ్లి..
తిరువొత్తియూరు(చెన్నై): తిరుపూర్లో ఫైనాన్స్ సంస్థ యజమానిని కట్టివేసి రూ.50 లక్షలు నగలు, నగదు చోరీ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. తిరుపూర్ పుస్పా రౌండ్ టానా రాయపండ్రా వీధికి చెందిన సంగమేశ్వరన్ (63) ఫైనాన్స్ సంస్థ నడుపుతున్నాడు. అతని భార్య రాజేశ్వరి (57). ఆదివారం రాత్రి 25 ఏళ్ల వయసున్న నలుగురు యువకులు మాస్కులు ధరించి సంగమేశ్వరన్ ఇంటిలోకి చొరబడ్డారు.
కత్తులు చూపించి నోటిలో గుడ్డలు కుక్కి వారిని తాడుతో కట్టి వేశారు. తర్వాత ఇంట్లో ఉన్న నగలు నగదును మూటగట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీ చేయగా బీరువాలో ఉన్న 40 సవర్ల నగలు, రూ.30 లక్షల నగదు చోరీ చేసినట్టు తేలింది. వీటి విలువ రూ. 50 లక్షలు చేస్తుందని సంగమేశ్వరన్ తెలిపారు.