సర్పంచ్‌ అభ్యర్థి భర్త అపహరణ  | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ అభ్యర్థి భర్త అపహరణ 

Published Tue, Feb 16 2021 7:59 AM

Sarpanch Candidate Husband Kidnapped By Maoists - Sakshi

ముంచంగిపుట్టు (అరకు): విశాఖ ఏజెన్సీ ముంచం గిపుట్టు మండలం బూసిపుట్టు పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి కిల్లో రాజమ్మ భర్త కిల్లో నాగేశ్వరరావును ఆదివారం రాత్రి మావోయిస్టులు అపహరించారు. తీవ్రంగా కొట్టి వదిలిపెట్టారు. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. మూడో విడతలో రేపు (బుధవారం) ఈ పంచాయతీకి జరగనున్న ఎన్నికల్లో రాజమ్మ సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఆదివారం రాత్రి బూసిపుట్టు పంచాయతీ డి.కంఠవరం గ్రామానికి వచ్చి నాగేశ్వరరావును తీసుకెళ్లారు. ఎన్నికలకు దూరంగా ఉండాలని హెచ్చరించినా వినకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన మావోయిస్టులు నాగేశ్వరరావును తీవ్రంగా కొట్టి సోమవారం మధ్యాహ్నం ప్రాణాలతో విడిచిపెట్టారు.

బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని గిరిజనులను మావోయిస్టులు హెచ్చరించినట్లు తెలిసింది. మావోయిస్టుల హెచ్చరికతో ఈ ప్రాంత గిరిజనులు ఓటు వేసేందుకు భయాందోళనలకు గురవుతున్నారు. బూసిపుట్టు సర్పంచ్‌ అభ్యర్థి రాజమ్మ  ఇప్పటివరకు డి.కంఠవరంలో అంగన్‌ వాడీ కార్యకర్తగా పని చేశారు. ఇటీవలే రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీ అభిమానిగా పోటీకి దిగారు. పోలింగ్‌ యథావిధిగా జరుగుతుందని, బూసి పుట్టు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కుమడ పంచాయతీలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశా మని ఎస్సై పి.ప్రసాదరావు చెప్పారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని కోరారు.
(చదవండి: కార్పొరేటర్‌ హత్య కేసులో నిందితుడు అరెస్ట్‌)
విషాదం: దోశ పిండి నీలాగే ఉందనడంతో 

Advertisement
Advertisement