ఎమ్మెల్యే సతీష్‌ తనయుడు, మేనల్లుడికి గాయాలు

Road Accident MLA Son Injured Mummidivaram East Godavari District - Sakshi

తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం 

మేనల్లుడి పరిస్థితి విషమం 

కాకినాడ క్రైం: తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పాత ఇంజరం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ పెద్ద కుమారుడు సుమంత్, ఎమ్మెల్యేకు వరుసకు మేనల్లుడైన కాకాడి లోకేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. అమలాపురంలోని నివాసం నుంచి సుమంత్, లోకేష్‌  మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కాకినాడ బయలుదేరారు.

పాత ఇంజరం వద్ద వారి కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న లోకేష్‌తో పాటు ముందు సీటులో ఉన్న సుమంత్‌  గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న హైవే మొబైల్‌ పోలీసులు  క్షతగాత్రులను యానాం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. సుమంత్‌ ఆరోగ్యం  మెరుగ్గా ఉండగా, లోకేష్‌ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

ఫోన్‌లో సీఎం జగన్‌ పరామర్శ 
ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కుమారుడు, మేనల్లుడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసి సీఎం వైఎస్‌ జగన్‌.. ఎమ్మెల్యేకు బుధవారం ఫోన్‌చేసి పరామర్శించారు. గాయపడిన వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు  ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ను పరామర్శించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top