భార్యలపై ఆగడాలు.. ఆఖరికి జైలులో ఆత్మహత్య
సెంట్రల్ జైలులో ఖైదీ ఆత్మహత్య
ఇద్దరు భార్యలను చిత్రహింసలకు గురి చేసిన కేసులో నిందితుడు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ కళ్యాణం వెంకన్న మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. జైలు సూపరింటెండెంట్ రాజారావు తెలిపిన వివరాల మేరకు.. చింతూరు మండలం చట్టి గ్రామానికి చెందిన వెంకన్నకి ఇద్దరు భార్యలు. వీరిపై అనుమానం పెంచుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఇతనిపై అభియోగం. చిత్రహింసలకు గురిచేస్తూ సెల్ఫోన్లో చిత్రీకరించేవాడు. ఆ వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా హల్చల్ చేశాయి.
అతను పెట్టే బాధలు భరించలేక ఇద్దరు భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతూరు పోలీసులు ఏప్రిల్ 19వ తేదీన నిందితుడ్ని అరెస్టు చేశారు. సెంట్రల్ జైలుకి రిమాండ్కు తరలించారు. జైలులో అతను మంగళవారం ఉదయం స్నానాల గదిలో మెడకు టవల్ చుట్టుకుని మృతి చెంది ఉండడాన్ని సహచర ఖైదీలు గమనించి జైలు అధికారులకు తెలిపారు.
చదవండి: ‘పెళ్లి అంటేనే నాకు ఇష్టం లేదు.. పుట్టింటికి వచ్చేస్తా’