బ్రిటీష్‌ యువతికి పెళ్లి పేరిట వల.. ఆపై దారుణం

Marriage Proposal: British Woman Shot Dead In Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌: బ్రిటీష్‌ దేశానికి చెందిన యువతి పాకిస్తాన్‌లో ఉంటుండగా ఇద్దరు యువకులు ఆమెను ఇష్టపడ్డారు. వారిద్దరూ ఆమెకు లవ్‌ ప్రపోజల్స్‌ చేశారు. అయితే వారు ప్రపోజల్‌ చేసిన కొన్నాళ్లకే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో పాకిస్తాన్‌లో​ కలకలం రేపింది. ఆ యువతి మరణం మిస్టరీగా మారింది. దీనిపై అక్కడి పోలీసులతో పాటు బ్రిటీష్‌ అధికారులు కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

బెల్జియంకు చెందిన లా విద్యార్థి మైరా జుల్ఫికర్‌ (25) పాకిస్తాన్‌లోని లాహోర్‌లో తన స్నేహితురాలు ఇఖ్రాతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. మూడు నెలల కిందట బ్రిటన్‌ నుంచి పాకిస్తాన్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు సాద్‌ అమీర్‌ భట్‌, జాహీద్‌ జడూన్‌ పరిచయమయ్యారు. ఆ ఇద్దరు యువకులు ఆమెను పెళ్లి చేసుకుంటామని ప్రతిపాదించారు. అయితే వారిని తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఆమె సోమవారం తుపాకీ తూటాలకు బలైంది. లాహోర్‌లో నివసించే ఆమె బాబాయి మహ్మద్‌ నాజీర్‌ విషయం తెలుసుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆమె హత్య విషయమై ఫిర్యాదు చేశాడు. 

మైరాకు ఇద్దరు పెళ్లి ప్రతిపాదన చేయగా దాన్ని తిరస్కరించినప్పటి నుంచి ఆమెకు ప్రాణహాని పొంచి ఉందని ఫిర్యాదులో ఆమె బాబాయి పేర్కొన్నాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. మెడ వద్ద.. తొడ భాగాన రెండు బుల్లెట్లను గుర్తించారు. అయితే వారిద్దరూ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోవాలనే కోణంలో విచారణ చేయగా.. వారిద్దరూ ఆమెను పెళ్లి చేసుకుంటే బ్రిటన్‌ వీసా లభిస్తుందనే ఆశించారట. 

అయితే ఆమె పెళ్లికి నిరాకరించిందనే ఆక్రోశంతో ఆమెపై కాల్పులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. మైరా జుల్ఫీకర్‌ హత్యలో అమీర్‌ భట్‌ హస్తం ప్రధానంగా ఉందని పోలీస్‌ అధికారి సిద్రా ఖాన్‌ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఇస్లామాబాద్‌, లాహోర్‌లో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై బ్రిటన్‌ అధికారులు కూడా ఆరా తీశారు.

చదవండి: కొత్తగా పెళ్లయిన కమెడియన్‌ జంటకు షాకిచ్చిన పోలీసులు
చదవండి: ఒకే రోజు లాక్‌డౌన్‌ ప్రకటించిన రెండు రాష్ట్రాలు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top