Man Two Marriage Mystery In Mahabubnagar - Sakshi
Sakshi News home page

రెండురోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు.. గుట్టుగా ఒకటి.. దర్జాగా మరొకటి

Dec 6 2021 1:03 PM | Updated on Dec 6 2021 2:11 PM

Man Two Marriage Mystery In Mahabubnagar - Sakshi

సాక్షి, ఊర్కొండ(ఖమ్మం): రెండురోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఓ యువకుడి నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ విజయభాస్కర్‌ కథనం మేరకు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూర్‌ మండలం ఆకునెల్లికుదురుకు చెందిన వంగ శేఖర్‌గౌడ్‌ హైదరాబాద్‌లో ఉంటూ ఓ యువతిని ప్రేమ పేరుతో శారీరకంగా లొంగదీసుకొని గత నెల 10న రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులోని ఓ ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా కట్న కానుకల కోసం మొదటి వివాహాన్ని దాచిపెట్టి పెద్దలు నిర్ణయించిన మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని గత నెల 12న సంప్రదాయ పద్ధతిలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఘనంగా వివాహమాడాడు. వారం తర్వాత ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అక్కడి పోలీసులు శేఖర్‌గౌడ్‌కు సమాచారం అందించి ఠాణాకు రావాలని పిలిపించారు. దీంతో ఇంట్లో వనపర్తికి వెళ్తున్నానంటూ నమ్మబలికి సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. విషయం తెలుసుకున్న రెండో వివాహం అమ్మాయి బాబాయి కుటుంబ సభ్యులతో కలిసి శేఖర్‌గౌడ్‌ను అనుసరించి సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడే అన్ని విషయాలు తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఊర్కొండ పోలీస్‌స్టేషన్‌లోనూ శేఖర్‌గౌడ్, వారి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement