మామ చేతిలో అల్లుడి హతం | Man Kills Son In Law In East Godavari | Sakshi
Sakshi News home page

మామ చేతిలో అల్లుడి హతం

Dec 30 2020 9:20 AM | Updated on Dec 30 2020 9:20 AM

Man Kills Son In Law In East Godavari - Sakshi

మామ చేతిలో హతమైన అల్లుడు వీరుల ప్రకాష్‌

సాక్షి, వై.రామవరం: మండలంలోని జంగాలతోట గ్రామంలో సోమవారం అర్ధరాత్రి మామ కోండ్ల చిన్నారావు చేతిలో అల్లుడు వీరుల ప్రకాష్‌(34) హతమయ్యాడు. మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని లోతట్టు అటవీ ప్రాంతంలో ఆ గ్రామం ఉండడం, కమ్యూనికేషన్‌ వ్యవస్థ లేకపోవడంతో సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రానికి సమాచారం అందుకున్న సీఐ రవికుమార్, ఎస్సై గంట పృథ్వీలు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మారేడు మిల్లి మండలం గుజ్జి మామిడివలస గ్రామానికి చెందిన మృతుడు వీరుల ప్రకాష్‌(34)కు జంగాల తోట గ్రామానికి చెందిన కోండ్ల చిన్నారావు కుమార్తె పార్వతితో వివాహమైంది. తరచూ మామ, అత్త, భార్యలను మృతుడు తప్పతాగి, వేధిస్తూ, కొడుతుండేవాడు.

సోమవారం రాత్రి కూడా మృతుడు తప్ప తాగి అందరినీ కొడుతుండగా, మామ ఆగ్రహించి అల్లుడు ప్రకాష్‌ మెడపై గొడ్డలితో వేటు వేయగా మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడు చిన్నారావు పరారీలో ఉన్నాడు. సీఐ, ఎస్సైలు జంగాల తోట గ్రామంలో గ్రామస్తులను, కుటుంబసభ్యులను విచారించి, కేసు  దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అడ్డతీగల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement