Man Kills Brother Suspecting Illicit Affair With Wife In Khammam District - Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. తమ్ముడిని నమ్మించి గ్రామ శివార్లలోకి తీసుకెళ్లి..

Oct 26 2022 1:57 AM | Updated on Oct 26 2022 10:08 AM

Man kills brother over Illicit Affair With Vadina In Khammam District - Sakshi

మృతుడు నరేశ్‌ (ఫైల్‌), నిందితుడు రామకృష్ణ 

వైరా రూరల్‌ (ఖమ్మం జిల్లా): అన్న భార్య వదినతో సంబంధం పెట్టుకుని తమ్ముడు దిగజారిపోతే అతడిని గొడ్డలితో నరికి చంపి మనిషిగా మరింత దిగజారిపోయాడు ఓ అన్న.  సోమవారం తెల్లవారుజామున ఖమ్మంజిల్లా వైరా మండలం రెబ్బవరంలో ఈ  ఘటన జరిగింది. రెబ్బవరం గ్రామానికి చెందిన సాదం రామారావు, రామకృష్ణ, నరేశ్‌(32) అన్నదమ్ములు.

రామకృష్ణ కూలిపనులు చేస్తుండగా, దివ్యాంగుడైన నరేశ్‌ వాటర్‌ప్లాంట్‌లో గుమాస్తా. వీరిద్దరూ తల్లి సుబ్బమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. రామకృష్ణ మొదటి భార్యతో మనస్పర్థలు వచ్చి విడిపోయి రెండోపెళ్లి చేసుకున్నాడు. నరేశ్‌ భార్య రెండేళ్ల క్రితం వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో పదిహేను రోజుల క్రితం తన భార్యతో నరేశ్‌ సన్నితంగా ఉండటాన్ని చూసిన రామకృష్ణ ఆమెను మందలించాడు. దీంతో ఆమె పిల్లలను తీసుకుని రాజమండ్రిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. నరేశ్‌తో వివాహేతర సంబంధం కారణంగానే ఆమె తనను వదిలేసి పోయిందని కక్ష పెంచుకున్న రామకృష్ణ తమ్ముడిని ఎలాగైనా హతమార్చాలని పథకం వేసుకున్నాడు.  

నమ్మించి తీసుకెళ్లి చంపేశాడు...  
తల్లి సుబ్బమ్మ దీపావళి పండుగకు కూతురింటికి వెళ్లగా రామకృష్ణ తన తమ్ముడిని హత్య చేసేందుకు పథకం పన్ని ఆదివారంరాత్రి రెబ్బవరం శివార్లలోకి తీసుకెళ్లి మద్యం తాగించాడు. తర్వాత ఇద్దరూ ఇంటికెళ్లి భోజనం చేసి పడుకున్నారు. అనంతరం నిద్రలోకి జారుకున్న నరేశ్‌పై రామకృష్ణ గొడ్డలితో విచక్షణారహితంగా నరికివేశాడు. దీంతో నరేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

అనంతరం విషయాన్ని మేనమామ చెరుకూరి లక్ష్మీనారాయణ, స్నేహితులకు రామకృష్ణ ఫోన్‌ చేసి చెప్పాడు. వీరు పోలీసులకు సమాచారం అందిచడంతో అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, తన భార్యతో సన్నిహితంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకే తమ్ముడిని హతమార్చినట్లు విచారణలో రామకృష్ణ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement