కళామందిర్‌కు కన్నమేశాడు | Sakshi
Sakshi News home page

కళామందిర్‌కు కన్నమేశాడు

Published Tue, Dec 15 2020 2:21 PM

Kukatpally Kalamandir: Security Guard With Rs 9 Lakh Cash - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాను పని చేస్తున్న షాపింగ్‌మాల్‌కే కన్నమేశాడు ఓ సెక్యూరిటీ గార్డ్‌. ఆ సంస్థకు రక్షణ కల్పించాల్సింది పోయి సుమారు రూ. 9 లక్షలు దొంగిలించిన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేసన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐ నర్సింగరావు వివరాల ప్రకారం.. భాగ్యనగర్‌కాలనీలోని కళామందిర్‌ వస్త్ర దుకాణంలో  నాలుగేళ్లుగా అస్సాంకు చెందిన మోనీదాస్‌ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థ నిర్వాహకులు అతనిపై నమ్మకంతో షాపింగ్‌ మాల్‌ తెరవడం, మూసే బాధ్యతలు అప్పగించారు. ఇదే అదనుగా చేసుకున్న మోనీదాస్‌ లాకర్‌కు మారుతాళం చేయించాడు.

శనివారం తాళాలు వేసిన మోనీదాస్‌ అసలైన తాళం తీసుకొని, మారు తాళాన్ని మేనేజర్‌కు అందజేశాడు. ఆదివారం లాకర్‌ తీస్తుండగా ఎంతకూ రాకపోవడంతో ఆరా తీయగా నకిలీతాళం అని తేలింది.  అయితే.. అదేరోజు మోనీదాస్‌ సైతం విధులకు హాజరు కాకపోవటంతో అనుమానం తలెత్తింది. మరో తాళం తెప్పించి లాకర్‌లో చూడగా రూ. 9 లక్షలు పోయినట్లు గుర్తించారు. సమీపంలోని అతని ఇంటికెళ్లి చూడగా అప్పటికే భార్యా పిల్లలతో పరారైనట్లుగా గుర్తించారు. ఈ పని మోనీదాస్‌దేనని భావించి పోలీసులకు సమాచారం అందజేశారు. మేనేజర్‌ మోహన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

ఇంటితాళం పగలగొట్టి..
ఇంటి తాళం పగలగొట్టి నగదు అపహరించిన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. బాలాజీనగర్‌ సాయిరాం ఎన్‌క్లేవ్‌లో నివాసముండే సురేష్‌ నెలక్రితం వైజాగ్‌కు వెళ్లాడు. ఆదివారం రాత్రి ఇంటి తాళం పగల­గొట్టి బంగారం గొలుసు, ఓ ఉంగరం దొంగిలించారు. సమా­చారం అందుకున్న సురేష్‌ వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయ­టంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదని..

Advertisement

తప్పక చదవండి

Advertisement