12 ఏళ్ల క్రితం వివాహం.. యువతులతో కలిసి నృత్యం చేసిందని..

Husband Molested His Wife In Warangal - Sakshi

సాక్షి,నల్లబెల్లి (వరంగల్‌): భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. భూక్యా కన్నమ్మ– భోజ్య దంపతుల కుమార్తె మంగ(30)ను అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన బాదావత్‌ రమేష్‌కు ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. నాలుగేళ్లుగా మంగను భర్త వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో ఆమె పుట్టింటికి రాగా.. తల్లిదండ్రులు పలుమార్లు రమేష్‌ను మందలించి కాపురానికి పంపించారు. ప్రస్తుతం ఆమె గ్రామ ఉపసర్పంచ్‌గా పనిచేస్తున్నారు.

గ్రామంలో బుధవారం తీజ్‌ ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న మంగ యువతులతో కలిసి నృత్యం చేసింది. అనంతరం ఇంటికి చేరుకున్న మంగను భర్త దూషిస్తూ కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె మంగళవారం రాత్రి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతురాలి సోదరుడు యాకుబ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ట్రెయినీ ఎస్సై బండి రామకృష్ణ తెలిపారు.

ఉరి వేసుకుని వ్యక్తి..
నర్సింహులపేట: మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట శివారు ఎర్రలచ్చయ్యగూడెం(బంజర)కు చెందిన దొణాల విక్రమ్‌(40) మతిస్థిమితం కోల్పోయి క్షణికావేశంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు. నాలుగు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్‌ జరిగి విక్రమ్‌ మతిస్థిమితం కోల్పోయాడు. దీనికితోడు తల్లిదండ్రులు మరణించడంతో మనస్తాపం చెందాడు. మంగళవారం రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు. బుధవారం తెల్లవారుజామున ఇంటి ఎదుట ఉరి వేసుకుని కనిపించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య నిర్మల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top