6 నెలల క్రితమే వివాహం.. భార్య పుట్టింటికి వెళ్లిందని..

Husband Kidnap His Wife In Mother In Law Home Warangal - Sakshi

అల్లుడే తన కూతురిని బలవంతంగా తీసుకెళ్లినట్లు తల్లి ఫిర్యాదు

సాక్షి,గోవిందరావుపేట(వరంగల్‌): మండల కేంద్రంలో పట్టపగలే సినీఫక్కీలో యువతి కిడ్నాప్‌ కలకలం రేపింది. మండల కేంద్రంలోని పోస్టాఫీస్‌ పక్కనే ఉన్న అడ్వకేట్‌ దామెల్ల సుధాకర్‌ ఇంటి వద్ద ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..బుధవారం మధ్యాహ్నం రెండు కార్లలో నంబర్లు కనిపించకుండా జాగ్రత్త పడి యువకులు వచ్చారు. కారుదిగి ఇంటిలోకి వెళ్లి అక్కడే ఉన్న యువతి సోదరుడిని, తల్లిని కొట్టి యువతి శాంతిని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారు.

ఇదంతా గమనించిన చుట్టుపక్కల వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలేం జరిగిందో వచ్చిందెవరో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వెంటనే యువతి తల్లి దామెళ్ల రజని, కుమారుడితో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి శాంతి భర్త  చంద్రగిరి బాలరాజు తన కూతురును బలవంతంగా తీసుకుని వెళ్లినట్లు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పస్రా ఎస్సై కరుణాకర్‌రావు వెంటనే అన్ని మార్గాలలోని పోలీస్‌స్టేషన్‌లను అప్రమత్తం చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

6 నెలల క్రితమే వారికి వివాహమైందని కానీ శాంతి మాత్రం తల్లిదండ్రుల సూచనతోనే తల్లిగారి ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోపం పెంచుకున్న బాలరాజు కొందరి సహాయంతో ఈ కిడ్నాప్‌ వ్యవహారానికి  పాల్పడినట్లు సమాచారం. భర్తే అయినా ఇలా  కార్లలో వచ్చి కిడ్నాప్‌ చేసేందుకు సాహసించడం మండలంలో కలకలం రేపుతోంది. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.     

చదవండి: ఏంకష్టం వచ్చిందో.. వివాహమైన ఐదు నెలలకే..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top