Honour Killing in Chandanagar, Hyderabad | హైదరాబాద్‌లో పరువు హత్య కలకలం - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పరువు హత్య కలకలం

Sep 25 2020 9:28 AM | Updated on Sep 25 2020 3:32 PM

Honour Killing: Father Hired Men To Slain Her Husband in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో పరువు హత్య కలకలం రేపుతోంది. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక అల్లుడిని అతి కిరాతంగా హత‍్య చేయించాడో తండ్రి. చందానగర్‌కు చెందిన హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ప్రేమ వివాహాన్ని ఇష్టపడని యువతి తండ్రి కిరాయి మనుషులతో హేమంత్‌ను నిన్న మధ్యాహ్నం కిడ్నాప్ చేయించి, సంగారెడ్డిలో హత్య చేయించాడు.

కాగా హేమంత్‌ భార్యతో కలిసి ఉండగానే కిరాయి హంతకులు గురువారం మధ్యాహ్నం వారిద్దరినీ కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే  ఆ యువతి మాత్రం కారులో నుంచి తప్పించుకుని 100కి సమాచారం ఇచ్చింది. తన ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ హత్య జరిగేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు హేమంత్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి యువతి తల్లిదండ్రులతో పాటు తొమ్మిదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంగారెడ్డిలో లభ్యమైన హేమంత్‌ మృతదేహం 
యువతి తండ్రి ఇచ్చిన సమాచారంతోనే సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివారులోని చెట్ల పొదల్లో హేమంత్‌ మృతదేహాన్ని కనుగొన్నారు. గచ్చిబౌలి పోలీసులు నిన్న అర్థరాత్రి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. ఈ హత్యకు సంబంధించి ఆధారాలు సేకరించేందుకు సంగారెడ్డి క్లూస్‌ టీమ్‌ కిష్టాయాగూడెం వెళ్లింది.

Advertisement
 
Advertisement
Advertisement