క్యాడ్‌బరీ ఇండియాకు సీబీఐ భారీ షాక్‌ 

CBI Files Corruption Case Against Cadbury India, Searches Several Premises - Sakshi

క్యాడ్‌బరీ ఇండియాపై సీబీఐ ఎఫ్ఐఆర్

పన్ను ఎగవేతకు అవకతవకలు, అవినీతి ఆరోపణలు

రెండు రాష్ట్రాల్లోని సంస్థ కీలక ఆఫీసర్ల నివాస, అధికారిక  కార్యాలయాల్లో సోదాలు

సాక్షి, ముంబై:  ప్రముఖ చాక్లెట్‌ సంస్థ క్యాడ్‌బరీ ఇండియాకు భారీ షాక్‌ తగిలింది. తాజాగా క్యాడ్‌బరీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అవినీతి, మోసం ఆరోపణలతో కేసు నమోదు చేసింది. సంస్థకు చెందిన హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌లోని 10 ప్రదేశాలలో బుధవారం సీబీఐ దాడులు నిర్వహించింది. ప్రస్తుతం దీనిని మోండెలెజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలుస్తారు.

అవినీతి, వాస్తవాలను తప్పుగా చూపించడం, రికార్డుల తారుమారు లాంటి ఆరోపణలను సీబీఐ నమోదు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డిలో ప్రాంత ఆధారిత పన్ను ప్రయోజనాలను పొందేందుకు వాస్తవాలను తప్పుగా చూపి అవినీతికి పాల్పడిందని ఎఫ్ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. 2009-11 మధ్య క్యాడ్‌బరీ కేంద్ర ఎక్సైజ్ అధికారులతో కుట్ర పన్నిందని, 5 స్టార్, జెమ్స్ చాక్లెట్‌ను తయారు చేస్తున్న హిమాచల్ ప్రదేశ్‌లో తన కొత్త యూనిట్ కోసం 241 కోట్ల రూపాయల పన్ను ప్రయోజనాలను పొందారని  సీబీఐ ప్రధాన ఆరోపణ. 

పన్ను మినహాయింపుల కోసం ఎగ్జిక్యూటివ్ బోర్డులోని కొందరు సభ్యులు, ముఖ్య నిర్వాహకులతో కలిసి, రికార్డులను మార్చాలని,  మధ్యవర్తుల ద్వారా లంచాలు ఇవ్వడంతోపాటు ఆధారాలను కప్పిపుచ్చారనేది తమ అంతర్గత దర్యాప్తులో బయటపడిందని తెలిపింది. ఇద్దరు సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు నిర్మల్ సింగ్,  జస్‌ ప్రీత్‌ కౌర్‌ సహా అప్పటి క్యాడ్‌బరీ ఇండియా  వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్ అండ్ కంప్లైయన్స్) విక్రమ్ అరోరా, దాని డైరెక్టర్లు రాజేష్ గార్గ్, జైల్‌బాయ్ ఫిలిప్స్ సహా మొత్తం 12 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. పన్ను ప్రయోజనాలు పొందటానికి అధికారులకు లంచాలు, తప్పుడు సమాచారం అందించిందని తెలిపింది. ఆదాయ పన్ను మినహాయింపు పొందే అర్హత లేదని తెలిసినా, మోసపూరితంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించింది. అయితే.. దర్యాప్తు సంస్థ నమోదు చేసిన కేసుకు సంబంధించి తమకు ఇంకా ఎటువంటి అధికారిక సమాచార అందలేదని మోండెలెజ్ ఇండియా ప్రతిధి తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top