దారుణం: న్యాయం చేయాలని అడిగితే ఎంత పనిచేశారు..
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో నా ఇంటి సొంత స్థలంలోకి వెళ్లనీయకుండా నా స్థలంలో గోడ ఎందుకు కడుతున్నారని అడిగినందుకు కులపెద్దలు కుల బహిష్కరణకు గురిచేశారని బాధిత కుటుంబం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బొప్పాపూర్ గ్రామానికి చెందిన తెడ్డు రవి అనే వ్యక్తి ఇంటి స్థలంలో గోడ ఎందుకు నిర్మిస్తున్నారని అడిగినందుకు ఈనెల18న కులపెద్దలు సమావేశమై తన కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారని రవి పేర్కొన్నాడు.
కులం చిట్టిలోకి రానియ్యకుండా తొలగించారని, ఎవరైనా మాట్లాడితే జరిమానా విధిస్తామని తీర్మానించినట్లు తెలిపాడు. కులపెద్దలు మారుపాక శ్రీనివాస్, మారుపాక సత్యం, మారుపాక బాలఎల్లయ్య, మారుపాక నారాయణ, మస్కూరి శేఖర్పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. రవి ఫిర్యాదును పరిశీలించి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.