అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్‌ | Bhuma Akhila Priya 14 Days Remand In Bowenpally Kidnap Case | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్‌

Jan 6 2021 8:57 PM | Updated on Jan 6 2021 9:17 PM

Bhuma Akhila Priya 14 Days Remand In Bowenpally Kidnap Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హాకీ మాజీ ఆటగాడు ప్రవీణ్‌రావు, అతని ఇద్దరు సోదరుల కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్‌ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారు.  దీంతో పోలీసులు ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు అఖిలప్రియకు గాంధీ ఆస్పత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అఖిల ప్రియ వైద్య పరీక్షల రిపోర్టులో ఎలాంటి సమస్య లేదని వైద్యులు తేల్చారు. నీరసంతో కళ్లు తిరిగి పడిపోయినందునే అస్వస్థకు గురైనట్టు పేర్కొన్నారు. అనంతరం పోలీసులు ఆమెను జడ్జి నివాసంలో ప్రవేశపెట్టారు.

కాగా, బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిల ప్రియ ఏ2 గా ఉండగా.. ఆమె భర్త భార్గవ్‌రామ్‌ ఏ3గా, ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఏ1 ఉన్నారు. ఏవీ సుబ్బారెడ్డిని బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. భార్గవ్‌రామ్‌ పరారీలో ఉన్నాడు. ఇదిలాఉండగా.. బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అఖిలప్రియ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కిడ్నాప్‌ కేసుతో ఎలాంటి సంబంధం లేదని అఖిలప్రియ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో బెయిల్‌ పిటిషన్‌పై పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై రేపు సికింద్రాబాద్‌ కోర్టులో విచారణ జరగనుంది.


(చదవండి: కిడ్నాప్‌ కేసు: ఏ1 ఏవీ సుబ్బారెడ్డి అరెస్టు)

Advertisement
 
Advertisement
Advertisement