నువ్వు చనిపోతావ్‌.. నీ భార్య రెండో పెళ్లి చేసుకుంటుంది.. చివరికి ట్విస్ట్‌

Assassination Of Person Due To Astrology In Vijayawada - Sakshi

హత్యకు దారి తీసిన ‘జ్యోతిష్యం’!

విజయవాడ: తన కుటుంబం గురించి అసభ్యంగా ప్రచారం చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు పాల్పడిన ఘటన స్థానిక సీతారామపురం కొత్తవంతెన సెంటర్‌ వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కొత్తవంతెన సెంటర్‌లో నివాసం ఉంటున్న నిందితుడు గడ్డం బాబు అదే ప్రాంతంలో నివాసం ఉండే తన పెదనాన్న కొడుకు రత్నాల తంబిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు సూర్యారావుపేట సీఐ జానికీరామయ్య తెలిపారు.
చదవండి: తహసీల్దార్‌ కంత్రీ వేషాల్.. అమ్మాయిలను లోబరుచుకుని.. వీడియోలు తీసి..  

వివరాలు ఇవి.. 
నిందితుడు గడ్డం బాబుది నెల్లూరు జిల్లా కావలి. రెండేళ్ల క్రితం వీరి కుటుంబం విజయవాడలో స్థిరపడింది. సీతారామపురం కొత్తవంతెన సెంటర్‌ వద్ద అద్దె ఇంట్లో బాబు కుటుంబం నివాసం ఉంటుండగా అదే ప్రాంతంలోని వేరే గృహంలోని హతుడు రత్నాల తంబి(40) కుటుంబం నివాసం ఉంటుంది. తంబి కొత్తవంతెన వద్ద జామకాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండగా, గడ్డం బాబు పెయింటర్‌గా, అప్పుడప్పుడు ర్యాపిడో బైక్‌ క్యాబ్‌ నడుపుతుంటాడు. సొంతంగా ద్విచక్ర వాహనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నానని, ఫైనాన్స్‌పై వాహనం ఇప్పించాలని బాబు కొన్ని రోజుల క్రితం తంబిని కోరాడు. ఫైనాన్స్‌పై వాహనం దొరక్క పోవడంతో జీవితంలో ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు జాతకం చూపించుకోవాలని నిర్ణయించుకున్నారు. 

జాతకంలో దోషం..  
బాబు నివాసం ఉండే ఇంట్లోనే వేరే పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న జ్యోతిష్కుడిని వీరిద్దరు పది రోజుల క్రితం ఆశ్రయించారు. గడ్డం బాబు జాతకంలో దోషం ఉందని, త్వరలో గడ్డం బాబు చనిపోతాడని, ఆ తర్వాత అతని భార్య రెండో వివాహం చేసుకుంటుందని జ్యోతిష్యుడు చెప్పాడు. ఈ మాటలతో కంగుతిన్న వీరిద్దరు అక్కడ నుంచి వచ్చేశారు. వీరిద్దరు తరచూ కొత్త వంతెన వద్దే మద్యం సేవిస్తుంటారు.

అయితే జ్యోతిష్కుడు చెప్పిన మాటలను తంబి ఆ ప్రాంతంలోని ప్రజలకు, బంధువులకు చెప్పి అల్లరి చేస్తున్నాడని బాబు అనుమానించాడు. ఇదే విషయంపై రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తన భార్య రెండో పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం చేస్తున్న తంబిని హత్య చేసేందుకు బాబు నిర్ణయించుకున్నాడు. బుధవారం రాత్రి మద్యం సేవించిన బాబు కొత్తవంతెన వద్ద జామకాయలు అమ్ముతున్న తంబిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో తంబి సమీపంలోని తన సోదరి జ్యోతి పని చేసే ఓ ప్రైవేటు ఆస్పత్రికి చేరుకున్నాడు. గొంతుపై తీవ్ర గాయం కావడంతో కొద్ది సేపటికే తంబి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హతుడు తంబి సోదరి జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తంబికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top