ఈఎస్‌ఐ స్కాం: ‘కాల్ సెంటర్‌లో చూపించిన కాల్స్ అన్నీ నకిలీవే’

ACB Joint Director Ravi Kumar Press Meet Over ESI Scam In AP - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన రూ.150 కోట్ల ఈఎస్‌ఐ స్కాంలో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. మిగిలిన వారి కోసం ఏపీ, తెలంగాణలో గాలిస్తున్నారు. కాల్‌ సెంటర్‌లో చూపించిన కాల్స్‌ అన్నీ నకిలీవేనని అధికారులు గుర్తించారు. తెలంగాణ కాల్స్‌ని లిస్ట్‌లో చూపించి బిల్లులు తీసుకున్నట్లు విచారణలో తేలిందని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్‌ చేశమన్నారు. మరో తొమ్మిది మందికి  సంబంధించి ఈ కేసులో ఆధారాలు సేకరించామని ఆయన చెప్పారు. త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని , నిందితుల సంఖ్యకూడా ఇరవై ఐదుకు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 

‘టీడీపీ హయాంలో మందులు, సర్జికల్, ల్యాబ్, మెడికల్, ఫర్నిచర్ కొనుగోలులో అవినీతిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. మందులు కొనుగోలులో అప్పటి ప్రభుత్వ నిబంధనలను పాటించలేదు. నిర్ణీత ధర కంటే ఎక్కువ రేట్లకు మందులను కొన్నట్టు గుర్తించాం. రూ.106 కోట్లు విలువ చేసే మందులు నాన్ కాంట్రాక్టు లో కొన్నారు. లక్ష పైన కొనే వాటిని ఈ ప్రోక్యూర్ లో కొనాలి, అయితే డైరెక్టర్స్ అలా కాకుండా కొన్ని సంస్థలతో కుమ్మక్కై అవకతవకలకు పాల్పడ్డారు. ఈ టెండర్ల పక్కన పెట్టి రూ.400 కోట్లకు కొనుగోళ్లు జరిపారు. ధనలక్ష్మి అనే ఉద్యోగిని కుమారుడు అవకతవల కోసం అమరావతి మెడికల్స్, తిరుమల మెడికల్స్ ఏర్పాటు చేశారు. వాటిని  2019 తర్వాత మూసేశారని గుర్తించాం. కింద ఆసుపత్రి నుంచి స్టాక్ ఆడిగితేనే మందులు సరఫరా జరగాలి. డాక్టర్ జనార్దన్ రూ. 4 కోట్లు విలువైన మందులు అవసరం లేకుండా కొన్నారు. కొన్న మందులను ఏం చేశారో తెలీదు, స్టాక్ బోర్డు లెక్కలు  సరిపోలేదు. ప్రమోద్ రెడ్డి, నీరజ్ రెడ్డికి మంత్రి అచ్చెన్నాయుడు టెలీ సర్వీసెస్ పేరుతో కాంట్రాక్టు ఇప్పించారు.

టెలీ సర్వేసెస్‌లో సేవలు పొందిన పేషేంట్ నుంచి రూ. 1.20 పైసలు వసూలు చేయాలి.సర్వీసు వాడుకున్న  వారి నుంచి కాకుండా  బిల్ క్లెయిమ్ చేశారు.టెలీ సర్వీసెస్ కాల్స్ అన్నీ ఫెక్, అన్నీ తెలంగాణ ఫోన్స్ గా గుర్తించాం.రూ.480 రూపాయలు ఈసీజీకి వసూలు చేశారు. నిబంధనల ప్రకారం 200 మాత్రమే చేయాలి.టెలీ సర్వీస్‌లో రూ. 400 కోట్లు అక్రమాలు జరిగాయి. బడ్జెట్ కూడా పక్క దారి పట్టింది. రూ.132 కోట్లు బడ్జెట్ లేకపోయినా ఆర్డర్స్ చేశారు. ప్రభుత్వం 230 కోట్లు బడ్జెట్‌ కేటాయిస్తే.. 650 కోట్ల పర్చేజ్ ఆర్డర్‌ విడుదల చేశారు. కేసులో నిందితుల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు  రూ. 150 కోట్ల మేరకు అవినీతి జరిగినట్టు గుర్తించాం. అచ్చెన్నాయుడికి బెయిల్‌ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది’అని రవికూమార్‌ పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top