పాలసముద్రం : తమిళనాడులో ఎర్రమట్టికి డిమాండ్ అధికంగా ఉంది. ఇదే అదునుగా పాలసముద్రం మండలంలోని అధికార పార్టీ నేతలు మట్టి అక్రమ రవాణనే ఆదాయన వనరుగా మార్చేసుకున్నారు. పచ్చటి గుట్టను అడ్డాగా మార్చుకుని హిటాచీలతో తవ్వేసి టిప్పర్లలో తరలించేస్తున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే, రైతులు తమ పొలాల్లో గ్రావెల్ తోలుకునేందుకు తాత్కాలిక అనుమతులు ఇచ్చా మని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. అయితే రైతుల ముసుగులో టీడీపీ నేతలే మట్టి దందా సాగిస్తున్నారని తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో గ్రావె ల్ తవ్వకాలకు అడ్డుపడిన తహసీల్దార్, ఎస్ఐని టీడీపీ నేతలు బదిలీ చేయించారని, దీంతో అధికారులందరూ మనకెందుకులే అని దందాను పట్టించుకోవడం లేదని స్పష్టం చేస్తున్నారు.
జీవాలకు గ్రాసం కొరత
ఈ గుట్టను ఆధారంగా చేసుకుని పశువులే, గొర్రెల ను మేపుకుంటూ పలువురు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు పచ్చటి గుట్ట కాస్తా కరిగిపోతుండడంతో జీవాలకు గ్రాసం కొరత వచ్చిందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలను ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు.
విభేదాలు మరచి..
పాలసముద్రం మండలంలో టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం విమర్శలు గుప్పించుకునేవారు. వీరిలో ఒక వర్గానికి చెందిన నాయకుడు గ్రావెల్ దందా నడిపిస్తుంటే, మరో వర్గానికి చెందిన వాళ్లు గతంలో ధర్నాకు దిగారు. తర్వాత రెండు వర్గాల వారు విభేదాలను విడిచిపెట్టి మట్టి అక్రమ రవాణా చేసుకునేలా ఒప్పందానికి వచ్చేశారు. ఇక అప్పటి నుంచి యథేచ్ఛగా గ్రావెల్ దోపి డీని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికై నా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అక్రమంగా ఇచ్చిన తాత్కాలిక అనుమతులను రద్దు చేసి గట్టను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.


