పలమనేరు : ఓపెన్స్కూల్ కో–ఆర్డినేటర్ల మాయమాటలకు వందలాది మంది విద్యార్థులు మోస పోయారు. సులభంగా ఇంటర్ పాస్ కావచ్చనే ఉద్దేశంతో రూ.వేలు ముట్టజెప్పి లబోదిబోమంటున్నారు.
భారీగా వసూళ్లు
ఓపెన్ స్కూళ్ల కో–ఆర్డినేటర్లు ఎగ్జామ్ ఫీజుతోపాటు ఇతర ఏర్పాట్ల కోసం విద్యార్థుల నుంచి భారీగా నగదు వసూలు చేసారు. అంతా మేం చూసుకుంటామని భరోసా ఇవ్వడంతో విద్యార్థులు పరీక్షలకు ఏమాత్రం ప్రిపేర్కాకుండా వచ్చేశారు. అయితే పరీక్ష కేంద్రాల వద్ద కో–ఆర్డినేటర్లు కనిపించకపోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో అనవసరంగా డబ్బులిచ్చి మోసపోయామని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీనిపై ఎంఈఓ లీలారాణిని వివరణ కోరగా ఆమె స్పందించారు. ఓపెన్ స్కూళ్ల కో–ఆర్డినేటర్ల అక్రమ వసూళ్లపై తమకు ఫిర్యాదులు అందాయన్నారు. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారించి తగు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు.
ఓపెన్ స్కూల్ చేరండి.. సులభంగా ఇంటర్ ఉత్తీర్ణులుకండి.. పరీక్షలను దగ్గరుండి రాయిస్తాం.. ఈజీగా పాస్ చేయిస్తాం.. అంటూ ఓపెన్ స్కూళ్ల కో–ఆర్డినేటర్లు ఊదరగొట్టారు. దీంతో వందలాది మంది ఆయా స్కూళ్లలో చేరిపోయారు. ఇదే అదునుగా సదరు కో–ఆర్డినేటర్లు ఒక్కొక్కరి వద్ద రూ.2వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేశారు. తీరా పరీక్ష సమయంలో ముఖం చాటేశారు. విద్యార్థులను గాలికి వదిలేశారు.


