పలమనేరు : పట్టణ సమీపంలోని గొబ్బిళ్లకోటూరు కొత్త చెరువు వద్ద పేకాట ఆడుతున్న పదిమందిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితులు బాలకృష్ణ, ఖాజాపీర్, లోకేష్, ఇలియాజ్, హయాత్, రవిచంద్ర, బాబు, శ్రీకాంత్, బుజ్జి, తాహీర్ నుంచి రూ.13,200 స్వాధీనం చేసుకున్నారు.
గెంటేసి.. తాళం వేసి!
శాంతిపురం : పింఛన్ నగదులో వాటా ఇవ్వలేదని ఓ వితంతువును ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన మండలంలోని సొన్నేగానిపల్లెలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు రుక్మిణమ్మ కథనం మేరకు వివరాలు.. కర్ణాటకలోని బంగారుపేటకు చెందిన రుక్మిణమ్మను భర్త వదిలేయడంతో కొడుకుతో కలిసి పుట్టింట్లో ఉండేది. దాదాపు 12 ఏళ్ల క్రితం సొన్నేగానిపల్లెకు చెందిన నారాయణప్పతో ఆమెకు పరిచయమైంది. అప్పటికే భార్య చనిపోయిన నారాయణప్ప ఆమెను పెళ్లి చేసుకుని స్వగ్రామానికి తీసుకువచ్చాడు. దీంతో ఆమె తన కొడుకును పుట్టింట్లో వదిలి ఇక్కడికి వచ్చేసింది. ఏడేళ్ల క్రితం నారాయణప్ప మృతి చెందాడు. అప్పటివరకు భర్తతో కలిసి ఉన్న ఇంట్లోనే ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవించేది. ప్రభుత్వం వితంతు పింఛను మంజూరు చేయడంతో భర్త తరపు బంధువులకు అందులో సగం డబ్బు, అంత్యోదయ కార్డు ద్వారా వచ్చే 30 కిలోల బియ్యంలో సగం ఇచ్చేది. కానీ, ఈ నెల 1వ తేదీన ఇచ్చిన రూ 4వేల పింఛనులో వాటా ఇవ్వకపోవడంతో ఆమెను ఇంటి నుంచి బంధువులు గెంటేసి, తాళం వేశారు. దీంతో ప్రాథమిక పాఠశాల వరండాలో రుక్మిణమ్మ తలదాచుకుంటోంది. పెన్షన్ డబ్బు ఇవ్వకపోవడంతోనే తన భర్తకు చెందిన ఇంటి నుంచి దౌర్జన్యంగా గెంటేశారని బాధితురాలు విలపిస్తోంది. అయితే మృతుడు నారాయణప్పకు సొంత ఇల్లు లేకపోవడంతో తన తమ్ముడికి చెందిన నివాసంలో ఉండేవారని, అందుకే వారు ఇప్పుడు ఇంటిని ఖాళీ చేయించారని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు.


