నకిలీ ప్రభుత్వం.. ఫేక్ ప్రచారం !
– ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ మండిపాటు
బైరెడ్డిపల్లె : ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల లడ్డూను ప్రతి ఒక్కరూ కళ్లకద్దుకుని ఇష్టంగా తింటారని, అంతటి పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని తప్పుడు ప్రచారం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోరెలా వచ్చిందని ఎమ్మెల్సీ కే.ఆర్.జే. భరత్ ప్రశ్నించారు. బైరెడ్డిపల్లెలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీనియర్ అని చెప్పుకుంటూ రౌడీ రాజ్యంలో జంగిల్ రాజ్లా మారిన ముఖ్యమంత్రి చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలని, నాయకులపై, వారి ఇళ్లపై దాడులను ప్రోత్సహించే హక్కు ఎవరిచ్చారన్నారు. ప్రజ లు కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ రాజకీయాలను గమనిస్తున్నారన్నారు. తిరుమల లడ్డూ లో జంతువుల కొవ్వు ఉందని అభాండం వేసిన తర్వాత అది తప్పు అని సిట్, సుప్రీంకోర్టు నివేదికల ద్వారా తెలియజేస్తే చంద్రబాబు, లోకేష్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కూటమి నేతలు ఇతరులపై దాడులకు తెగబడుతున్నట్లు ఆయన మండిపడ్డారు. అందులో భాగంగా కాపు నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిందన్నారు. పోలీసులు అక్కడే ఉన్నా ఆపే ప్రయత్నం చేయలేదని, ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రోత్సాహంతో జరిగి న దాడి అని అర్థమవుతోందన్నారు. గతంలో పట్టా బి, చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్లు నోటితో చెప్పలేని విధంగా వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై మాట్లాడిన అసభ్య పదజాలాన్ని ఆయన గుర్తు చేశా రు. ఆ సమయంలో కనిపించని బాధ అధికారంలో కి వచ్చాక వారికి ఇప్పుడు ఎలా కనిపిస్తోందన్నారు. రాంబాబు సంఘటన జరిగిన కొంత సమయం కాక ముందే జోగి రమేష్ ఇంటిలో భార్య, పిల్లలు, తండ్రి ఉండగా దాడులు చేయడం, పెట్రో బాంబులతో కలకలం సృష్టించడం హేయమైన చర్య అన్నా రు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదన్నారు. సీనియర్ అని చెప్పుకుంటూ ప్రపంచమంతా తిరుగుతున్న వారికి సంస్కారం ఉండాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా తప్పుపట్టే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని ఎమ్మెల్సీ భరత్ ఘూటుగా విమర్శించారు.


