
కన్నీళ్లు తెప్పింఛన్
అధికారుల వద్దకు దివ్యాంగుల పరుగులు పింఛన్ల కోత, పింఛన్ డబ్బు తగ్గింపు గగ్గోలుపెడుతున్న బాధితులు
దివ్యాంగులకు ఆసరా అందించే పింఛన్కు కూటమి సర్కారు గండి కొట్టింది. రీ వెరిఫికేషన్ పేరుతో అర్హులైన పలువురికి పింఛన్ రద్దు చేయగా, మరెందరికో కోత విధించింది. ఫలితంగా దివ్యాంగుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. సదరమ్ సర్టిఫికెట్లు, రీవెరిఫికేషన్ కోసం ఆస్పత్రులకు నడవలేక.. అధికారులు చుట్టు తిరగలేక ఇక్కట్లు పడుతున్నారు. వారికి పింఛన్ కన్నీళ్లు తెప్పిస్తోంది.
బంగారుపాళెం: కూటమి ప్రభుత్వం రీ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల పింఛన్లలో కోత పెడుతోంది. దీంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. పూర్తి వైకల్యం కలిగి ఉన్నప్పటికీ తమకు పింఛన్లను తొలగించారంటూ బుధవారం పలువురు దివ్యాంగులు బంగారుపాళెం ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఇటీవల వికలాంగ పింఛన్ల రీ వెరిఫికేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మండలంలో 159 మంది అనర్హులుగా తేల్చి నోటీసులు అందజేశారు. తాము పుట్టుకతోనే వికలాంగులుగా ఉన్నామని, 90 శాతం వైకల్యం ఉందని డాక్టర్లు పరిశీలించి సర్టిఫికెట్లు సైతం జారీ చేశారన్నారు. రీ వెరిఫికేషన్లో తమకు 40 శాతం కంటే తక్కువ ఉందని పింఛన్ కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకల్యంతో బాధపడుతూ ప్రభుత్వం ఇచ్చే డబ్బుపైనే ఆధారపడి కాలాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో పింఛన్ తొలగించడంతో దిక్కుతోచడంలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అందుతున్న పింఛన్లను అకారణంగా ఎందుకు తొలగించారో అర్థం కాక, ఏమి చేయాలో దిక్కు తోచక తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామన్నారు.
రూ.6 వేలకు తగ్గించారు
నేను పుట్టుకతోనే దివ్యాంగుడిని. 90 శాతం వైకల్యం సర్టిఫికెట్ ఉంది. వైకల్యం శాతం తగ్గించి రూ.15 వేలు వస్తున్న పింఛన్ను తగ్గించి రూ.6 వేలకు మార్చారు. ఇలా 48 మందికి పింఛన్లను తగ్గించారు.
– ప్రభాకర్రెడ్డి, దివ్యాంగుడు, తగ్గువారిపల్లె
నాకు పింఛన్ కట్ చేశారు
నేను పుట్టుకతోనే దివ్యాంగుడిని. నాకు 95 శాతం వైకల్యం సర్టిఫికెట్ ఉంది. గతంలో రూ 15 వేలు పింఛన్ వచ్చేది. ప్రస్తుత ప్రభుత్వం వికలాంగుల పింఛన్ రీ వెరిఫికేషన్ చేసింది. తనకు 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉందంటూ నోటీసు ఇచ్చి పింఛన్ కట్ చేశారు. నడవలేని స్థితిలో ఉన్న మాలాంటి దివ్యాంగులకు పింఛన్లో కోత విధించడం ఎంతవరకు సమంజసం. తమకు పింఛన్ అందించి న్యాయం చేయాలి.
–గోపి, దివ్యాంగుడు, తంబుగానిపల్లె