
కలెక్టర్ సారూ.. కరుణచూపరా..!
కాళ్లు, చేతులు పడిపోయి..బక్కచిక్కిపోయిన హర్షద్ రీ వెరిఫికేషన్లో 40 శాతం తక్కువగా ఉందని పింఛన్ కట్ కలెక్టర్ వద్ద గోడు వెళ్లబోసుకున్న జరగని న్యాయం మళ్లీ జీరో శాతమంటూ ఆస్పత్రి రిపోర్ట్
బంగారుపాళ్యం/కాణిపాకం: పక్షవాతంతో ఓ దివ్యాంగుడికి కాళ్లు, చేతులు పూర్తిగా పడిపోయాయి. బక్కచిక్కిపోయిన శరీరంతో ప్రాణం నిలబెట్టుకుంటున్నారు. ఇన్నాళ్లు పింఛన్ సొమ్ముతో కాస్త ఆయుషు పోసుకుంటున్నాడు. అయితే రీ వెరిఫికేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం ఆ దివ్యాంగుడి పింఛన్కు ఎసురు పెట్టింది. తొలుత 40 శాతం కంటే తక్కువగా వైకల్యం ఉందని, కలెక్టర్ ఫిర్యాదుతో జీరో శాతం ఉందని మళ్లీ నోటీసులు ఇవ్వడంతో కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బంగారుపాళెం మండల కేంద్రానికి చెందిన సమ్మద్, సాహిన్ దంపతుల పెద్ద కుమారుడు హర్షద్. ఇతడు 8 నెలలకే జన్మించాడు. పుట్టుకతోనే పక్షవాతం బారిన పడ్డాడు. దీనికితోడు మెదడు సమస్య వచ్చింది. అప్పటి నుంచి హర్షద్ను తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. నెలవారీ పింఛన్తో హర్షద్ ఆస్పత్రి ఖర్చులు చూసుకుంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం చేపట్టిన రీ వెరిఫికేషన్లో హర్షద్ను అనర్హుడిగా తేల్చారు. 40 శాతం కంటే తక్కువగా ఉందని సచివాలయ సిబ్బంది నోటీసులు ఇచ్చారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు రోడెక్కారు. సోమవారం కలెక్టర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ మళ్లీ వెరిఫికేషన్కు ఆదేశించారు. అయితే ఆ రిపోర్ట్ను జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని పరిశీలన విభాగం కొట్టి పడేసింది. మళ్లీ జీరో శాతమని, హర్షద్ బాగుండాడని, ఎలాంటి సమస్యలు లేవని నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్ను బుధవారం సచివాలయ సిబ్బంది బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ నోటీసును చూసి వారు కంటతడిపెడుతున్నారు. కలెక్టర్కు విన్నమించుకున్న ఏమిటీ విచిత్రమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి చూసి...ఎలాంటి సమస్యలు లేనట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఆగ్రహానికి గురవుతున్నారు. నిజంగానే అధికారులకు కళ్లుండి ఇలా చేస్తున్నారా.. లేక కక్షపూరితంగా చేస్తున్నారనే అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. కనికరం లేకుండా ఇలా చేయడం దారుణమని కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ కల్పించుకుని న్యాయం చేస్తారా, లేదా చూడాలి మరీ.