
అయ్యా..సమస్యలు పరిష్కరించండి!
● కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● అర్జీలు స్వీకరించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ● 258 అర్జీలు నమోదు
చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా దూర ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం కలెక్టరేట్కు విచ్చేస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం అర్జీలు ఇస్తూనే ఉన్నాం. అయితే క్షేత్రస్థాయిలో తమ సమస్యలు ఏ మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. సమస్యల పరిష్కారానికి ఇంకెన్ని సార్లు కార్యాలయాల చుట్టూ తిరగాలయ్యా అంటూ అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దయచూపి తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు.’
258 అర్జీలు నమోదు
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ శాఖలకు సంబంధించి 258 అర్జీలు నమోదయ్యాయి. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలే 213 ఉండడం గమనార్హం. మిగిలిన శాఖలకు సంబంధించి పోలీసు 6, డ్వామా 1, ఆర్అండ్బీ 1, డీఆర్డీఏ 26, డీసీహెచ్ఎస్ 1, మున్సిపల్ కమిషనర్ నగరి 2, డీఎస్ఓ 4, పశుసంవర్థకశాఖ 2, హౌసింగ్ 3 మొత్తం 258 అర్జీలను ప్రజలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి, వెంకటశివ, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
గుడి స్థలం ఆక్రమిస్తున్నారు
గుడి స్థలాన్ని కొందరు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నా రని గంగాధరనెల్లూరు మండలం పిళ్లారికుప్పం ప్రజలు రామప్ప, సుజిత్ తదితరులు వాపోయారు. వారు మాట్లాడుతూ తమ గ్రామంలో దాదాపు 100 సంవత్సరాల నుంచి శ్రీరామకృష్ణ భజన మందిరం ఉండేదన్నారు. కాల క్రమేణా ఆ మందిరం శిథిలావస్థకు చేరుకోగా భజనమందిరం వెనుక వైపున తాత్కాలికంగా దేవుడి పటాలు ఏర్పాటు చేశామన్నా రు. అక్కడే దూపదీపనైవేద్యాలు సమర్పిస్తున్నామన్నారు. నూతన భభజన మందిరం నిర్మాణానికి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సర్వే చేసి, సర్వే నంబర్ 366/1లో 0.04 సెంట్ల భూమిని కేటాయించి హద్దు రాళ్లు నాటారని చెప్పారు. అయితే ఆ భూమిని ప్రస్తుతం ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
ఫీల్డ్ అసిస్టెంట్లంటే చిన్నచూపెందుకు?
ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లంటే సర్కారుకు చిన్నచూపెందుకని క్షేత్రసహాయకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నించారు. ఆ సంఘ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అకారణంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం అన్యాయమని చెప్పారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 28 నుంచి విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.
ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి
జిల్లాలోని నగరి మండలం నత్తంకండ్రిగ దళితవాడలో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న దళిత కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఆ పార్టీ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ నగరిలోని 9వ వార్డులో నెత్తంకండ్రిగ దళితవాడలో నివాసం ఉంటున్న ఇళ్లకు ఇంటిపట్టాలు మంజూరు చేయాలన్నారు. పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, చిత్తూరు పట్టణ కార్యదర్శి గోపినాథ్, నాయకులు దాసరి చంద్ర,మణి,విజయ్ కుమార్, నత్తం కండ్రిగ గ్రామ కమిటీ నాయకులు రాజు వేలు,యేసయ్య,హరి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారయ్యా!
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారయ్యా అంటూ వెదురుకుప్పం మండలం యనమలమంద గ్రామానికి చెందిన ప్రజలు గణేష్, మునెమ్మ, గిరి, గోవిందమ్మ తదితరులు వాపోయారు. ఆ గ్రామస్తులు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు అర్జీని అందజేశారు. వారు మాట్లాడుతూ వెదురుకుప్పం మండలం యనమలమంద గ్రామం ఆళ్లమడుగు లెక్కదాఖలాలో సర్వే నంబర్ 435/2 లో 2.87ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందన్నారు. ఆ స్థలాన్ని గ్రామానికి చెందిన శ్రీరాములురెడ్డి కబ్జా చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని అనేక సార్లు వెదురుకుప్పం తహసీల్దార్కు విన్నవించుకున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమించుకుంటున్న స్థలాన్ని కాపాడి ఇళ్లు లేని పేదలకు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామానికి చెందిన నరసింహులు, వంశీ, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

అయ్యా..సమస్యలు పరిష్కరించండి!

అయ్యా..సమస్యలు పరిష్కరించండి!

అయ్యా..సమస్యలు పరిష్కరించండి!