
అమ్మో..ఐస్
● చల్లని పానీయాలు.. ఐస్గడ్డ విక్రయాలు ● తయారీలో కానరాని శుభ్రత ● వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు ● హెచ్చరికలు జారీ చేస్తున్న వైద్యనిపుణులు
కాణిపాకం : జిల్లాలో జ్యూస్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వీధికి రెండు నుంచి మూడు షాపులుంటాయి. వేసవి కాలం వస్తే రోడంతా చల్లటి జ్యూస్ షాపులు కిటకిటలాడుతుంటాయి. ఇంటి నుంచి బయటకొచ్చిన వారిలో 40 శాతం మంది వీటిని గబగబా తాగేస్తుంటారు. వీరంతా చల్లటి ఐస్ వేస్తే తప్ప ఆ జ్యూస్ ముట్టుకోవడం లేదు. ఇక వేసవి సీజన్లో జరిగే ప్రతి శుభకార్యంలోనూ ఈ చల్లటి ఐస్ ముక్కలు వేసి కలిపిన జ్యూస్లు విచ్చలవిడిగా ఇస్తుంటారు. ఈ ఐస్ గడ్డలు తయారు చేసే కేంద్రాలు చాలా చోట్ల అధ్వాన్నంగా కలుషిత నీటితో తయారీ చేస్తుంటారని, రోగాలు తప్పవని వైద్య నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో ఐస్ గడ్డ తయారీ కేంద్రాలు 40 దాకా ఉన్నాయి. ఒక్కో షాపు నుంచి రోజువారిగా సుమారు 500 కిలోలు అమ్ముడుపోతాయని అంచనా. ఈ లెక్కన జిల్లాలో 20 వేల కిలోల ఐస్ గడ్డలు అమ్ముడుపోతుంటాయి. దీనికి తోడు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు తమిళనాడు నుంచి ఐస్ గడ్డలు విపరీతంగా సరఫరా అవుతున్నాయి. ఇలా ఐస్ గడ్డల విక్రయాల ద్వారా జిల్లాలో రూ. 8 లక్షలకు పైగా వ్యాపారం నడుస్తున్నట్లు వారు లెక్కలు చెబుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా..
ఐస్ గడ్డల తయారీ సీజనల్ వ్యాపారమే అయినా తక్కువ పెట్టుబడి .. అధిక లాభాలున్నాయి. అయితే ఐస్ తయారీ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. పరిశ్రమల శాఖ, ట్రేడ్ లైసెన్స్, కాలుష్య నియంత్రణ బోర్డు, విద్యుత్ శాఖ ద్వారా వాణిజ్య విద్యుత్తు కనెక్షన్, భవనానికి సంబంధించి పట్టణ ప్రణాళిక, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతులుండాలి. చాలా చోట్ల ఈ రకమైన అనుమతులు లేవు. చాలా వరకు ఇళ్ల మధ్య, రేకుల షెడ్లలో నిర్వహిస్తున్నారు.
అపరిశుభ్రమైన ఐస్ వాడకంతో..
అపరిశుభమైన ఐస్ వాడటం వల్ల అనారోగ్య సమస్యలు ముంచెత్తుతున్నాయి. విష జ్వరాలు, టైపాయిడ్, దగ్గు దడ పుట్టిస్తున్నాయి. గొంతు నొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు బాధేస్తున్నాయి. చిన్న పిల్లలకు గవద బిళ్లలు వచ్చే ప్రమాదం ఉంటుంది. రోటా, అడినో, హైపటైటిస్–ఏ వంటి వైరస్ల వల్ల ఊపిరితిత్తులు, పచ్చకామెర్లు వస్తుంటాయి. ఈ–కోలీ, సిగెల్లా వంటి వైరస్ల వల్ల వాంతులు, విరేచనాలు అవుతుంటాయని ప్రజలు జాగ్రత్త పడాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
ఎండలో తిరిగాం.. చల్లటి జ్యూస్ తాగుదామని అనుకుంటే కచ్చితంగా ప్రతి ఒక్కరూ శుభ్రతను పరీక్షించుకోవాలి. చల్లగా ఉందని గటగటా తాగితే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. వాంతులు, విరేచనాలవుతాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు అవుతాయి. ఎండా కాలంలో కచ్చితంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి జ్యూస్లకు బదులు తాజా పండ్లు, అధిక నీటిని తీసుకుంటే చాలు. సబ్జా గింజలు రోజుకు 15 గ్రాములు నానబెట్టి తీసుకుంటే శరీరం వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. – నందీశ్వర్, వైద్య నిపుణులు, చిత్తూరు

అమ్మో..ఐస్

అమ్మో..ఐస్

అమ్మో..ఐస్

అమ్మో..ఐస్