
● వినియోగదారుల్లో కానరాని ఆదరణ ● కనిపించని విద్యుత్ శా
చిత్తూరు కార్పొరేషన్ : మారుతున్న కాలానుగుణంగా విద్యుత్ పరికరాల వినియోగం అధికమవుతోంది. ఈ క్రమంలో అవగాహన లేక వినియోగదా రులపై భారం పడుతోంది. గతంలో వారు విద్యుత్ కనెక్షన్ తీసుకున్న రోజున లోడుకు నేడు విని యోగిస్తున్న లోడుకు సంబంధం లేదు. దీంతో అధికారులు తనిఖీ చేసిన సమయంలో క్రమబద్ధీ కరణకు చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్శాఖ అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వినియోగదారులకు ధరలో 50 శాతం రాయితీ ఇస్తోంది. కిలోవాట్కు రూ.2250 బదులు రూ.1,250 చెల్లిస్తే సరిపోతుంది. ఈ అవకాశం జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.
గృహ వినియోగదారులకు ఇంత మొత్తంలో రాయితీ కల్పిస్తున్నా తగినంత ప్రచారం లేదు. అధికారులు పత్రికా ప్రకటనలు కాకుండా సెక్షన్, సబ్ డివిజన్ల వారీగా వీటిపై అవగాహన కల్పించాలి. ఏఈ, డీఈ, ఈఈ, ఈఆర్వో కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో బ్యానర్లు ఏర్పాటు చేయాలి. ప్రతినెలా విద్యుత్ బిల్లులు ఇచ్చేటప్పుడు వినియోగదారులకు వీటిపై అవగాహన కోసం కరపత్రాలను ఇవ్వాలి. జిల్లాలో మొత్తం 4,37,377 గృహ సర్వీసులు ఉన్నాయి. స్వచ్ఛందలోడ్ కాబట్టి ఎంత మందికి ఇది అవసరమో గణాంకాలు అధికారుల వద్ద లేవు. ఇప్పటి వరకు జిల్లాలో 1,893 మంది క్రమబద్ధీకరణ చేసుకోగా వాటి ద్వారా సంస్థకు రూ.20 లక్షలు వచ్చింది.
ఎక్కడ చేసుకోవాలి
మీ కరెంటు బిల్లు తీసుకుని బిల్లు వసూలు కేంద్రానికి వెళ్లాలి. లోడ్ రెగ్యులైజేషన్, 50 శాతం రాయితీ అని చెబితే సరిపోతుంది. ఒక కిలోవాట్కు రూ.1000 ఇతర రుసుములు రూ.250 కలిపి రూ.1250 కట్టించుకుంటారు. అదే రెండు కిలోవాట్లు అయితే రూ.2450, 3 కిలోవాట్లు అయితే రూ.3,650 చెల్లించాలి. అదే ఆన్లైన్లో చెల్లించాలి అంటే ఏపీఎస్పీడీసీఎల్ సైట్లోకి వెళ్లాలి. అందులో వాలంటరీ అడిషనల్ లోడ్ స్కీము 50 శాతం రాయితీ డెవలప్మెంట్ చార్జీస్ అనే వాటిని క్లిక్ చేయాలి. అందులో విద్యుత్ సర్వీసు నంబర్ ఇచ్చి డిటెయిల్స్లోకి వెళ్లాలి. అందులో విత్ అవుట్ ఎస్టిమేట్ నమోదు చేసి మొబైల్ నంబరును కొట్టాలి. ఉన్న లోడ్, అడిషనల్ లోడ్ను నమోదు చేయాలి. తర్వాత కరెంటు బిల్లు, ఐడీ ఫ్రూఫ్ను పీడీఎఫ్లో ఆప్లోడ్ చేసి డిమాండ్ను చెల్లించాలి. వచ్చే నెల నుంచి మీ లోడ్ వివరాలు కనిపిస్తాయి.
జూన్ వరకు నిరీక్షించొద్దు
స్వచ్ఛందంగా అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు గడువు చివరి వరకు వేచి ఉండద్దు. జూన్ వరకు సమయం ఉందని పలువురు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అంతలోపు సిబ్బంది తనిఖీలు చేసి నోటీసులు ఇస్తే రాయితీ రాదు. విద్యుత్ బిల్లులు చెల్లింపు కేంద్రాల వద్ద ప్రచార బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. వినియోగదారులు 50 శాతం రాయితీ అవకాశాన్ని వినియోగించుకోండి.
– ఇస్మాయిల్ అహ్మద్, ఎస్ఈ ట్రాన్స్కో
మీ నివాసం లోడ్ ఎంత?
చాలా మందికి తమ ఇంటి విద్యుత్ కనెక్షన్ లోడ్ ఎంతో తెలియదు. సంవత్సరాల కిందట కనెక్షన్లు తీసుకున్న వారు వేల మంది ఉన్నారు. అప్పట్లో ఒక కిలోవాట్ అంత కన్నా తక్కువ కట్టించుకుని కనెక్షన్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రతి నివాసంలో పరికరాలు సంఖ్య పెరిగింది. దీనికి తోడు వేసవిలో ఫ్యాన్, కూలర్, ఏసీలు పెరుగుతున్నాయి. దీంతో లోడ్ పెరిగి ట్రిప్ సమస్యలతో సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. కాంట్రాక్ట్ లోడ్ మీ ఇంటి విద్యుత్ లోడ్ను తెలియజేస్తుంది. విద్యుత్ బిల్లులో ఉన్న ఆ లోడ్ను పరిశీలించి ఇంట్లో వాడుతున్న పరికరాల కెపాసిటీ ఆధారంగా సింపుల్గా లెక్కకట్టి అదనపు లోడ్ ఎంత అవసరమో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు 10 సంవత్సరాల కిందట 1 కేవీతో సర్వీసు తీసుకున్న వారు ప్రస్తుతం ఏసీ, వాషింగ్ మెషిన్, మోటారు, మిక్సీ ఇలా పరికరాల సంఖ్య పెరిగి ఉంటుంది. 1 టన్ ఏసీకే తీసుకున్న కెపాసిటీ సరిపోతుంది. మిగిలిన వాటికి తక్కువనుకున్నా 2 కేవీ క్రమబద్ధీకరణ చేసుకోవాల్సి ఉంది. వీటికి సిబ్బంది తనిఖీ చేయక ముందే స్వచ్ఛందంగా చెల్లిస్తే రూ.4,450 కాకుండా రూ.2,450 చెల్లిస్తే సరిపోతుంది.
నోటీసులు ఇస్తే మొత్తం చెల్లించాలి
వాడే విద్యుత్ను బట్టి ఇంట్లో ఉన్న ఉపకరణాలను అంచనా వేయవచ్చు. బిల్లు ఎక్కువగా వస్తుంటే అదనపు లోడ్ వాడుతున్నట్లు గుర్తిస్తారు. ఇలాంటి వారి సర్వీసులను అధికారులు తనిఖీ చేసి అదనంగా ఎంత లోడ్ వాడుతున్నారో నమోదు చేస్తారు. దానికి డబ్బులు చెల్లించాలని నోటీసులు ఇస్తారు. అధికారులు తనిఖీ చేసి నోటీసులు ఇస్తే కిలోవాట్కు నిర్దేశించిన మొత్తం చెల్లించాలి. అందులో ఎటువంటి రాయితీలు రావు. ఒక ఇంట్లో 4 ట్యూబ్లైట్లు, 3 ఫ్యాన్లు, వాషింగ్ మెషిన్, ఏసీ, ఫ్రిడ్జ్, ఐరన్బాక్స్ , ఎలక్ట్రికల్ కుక్కర్, టీవీ, కంప్యూటర్ ఉంటే వీటి సామర్థ్యం దాదాపు 6 కిలోవాట్లు. మీ ఇంటి కనెక్షన్ 2 కిలోవాట్లు అయితే అదనంగా 4 కేవీ వాడుకుంటున్నట్లే. ఇలా అదనంగా వాడుకునే దానికి 50 శాతం రాయితీతో రెగ్యులరైజ్ జూన్ 30 లోపు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
కుప్పంలోని గుణ రోజువారి కూలీగా జీవనం సాగిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి ఆయన అదనంగా 2 కిలోవాట్ల విద్యుత్తు వినియోగిస్తున్నారని గుర్తించారు. ఆయనకు రూ.4,450 చెల్లించాలని నోటీసు ఇచ్చారు.
నగరి పరిధిలో ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న ప్రైవేటు ఉద్యోగి రమేష్ అనే వ్యక్తి ఇంటికి వచ్చిన విద్యుత్శాఖ సిబ్బంది తనిఖీలు చేశారు. తీసుకున్న లోడు కంటే వాడే లోడ్ 4 కిలోవాట్లు అదనంగా వినియోగిస్తున్నారని తెలుసుకున్నారు. అందుకు గాను రూ.8,850 చెల్లించాలని నోటీసులు జారీ చేశారు.

● వినియోగదారుల్లో కానరాని ఆదరణ ● కనిపించని విద్యుత్ శా

● వినియోగదారుల్లో కానరాని ఆదరణ ● కనిపించని విద్యుత్ శా