అప్రెంటిస్‌షిప్‌ పట్ల మహిళల్లో ఆసక్తి  | Women apprenticeships rise as structured training expands | Sakshi
Sakshi News home page

అప్రెంటిస్‌షిప్‌ పట్ల మహిళల్లో ఆసక్తి 

Jan 9 2026 4:23 AM | Updated on Jan 9 2026 5:47 AM

Women apprenticeships rise as structured training expands

గత రెండేళ్లలో పెరిగిన భాగస్వామ్యం 

లింగ అంతరాలు తగ్గించడంలో కీలకం 

టీమ్‌లీజ్‌ – గాన్‌ గ్లోబల్‌ నివేదిక

న్యూఢిల్లీ: అప్రెంటిస్‌షిప్‌ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గడిచిన రెండేళ్ల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొనే మహిళల సంఖ్య పెరుగుతూ వస్తున్నట్టు టీమ్‌లీజ్‌ – గాన్‌ గ్లోబల్‌ నివేదిక వెల్లడించింది. లింగపరమైన అంతరాలను తగ్గించడంలో నిర్మాణాత్మక శిక్షణా కార్యక్రమాలు పోషిస్తున్న పాత్రను ఈ నివేదిక గుర్తు చేసింది. అలాగే, నైపుణ్యాలను పొందడంలో, దేశవ్యాప్తంగా సమ్మిళిత శ్రామికశక్తి భాగస్వామ్యానికి అనుకూలిస్తున్నట్టు తెలిపింది. 

2021–22లో మహిళా అప్రెంటిస్‌లు (శిక్షణార్థులు) 1,24,000 మంది ఉంటే, 2023–24 నాటికి 1,96,914కు పెరిగారు. గత దశాబ్ద కాలంలో వెయ్యికి పైగా సంస్థల్లో 10 లక్షల మందికి పైగా అప్రెంటిస్‌ల డేటాను ఈ నివేదిక పరిశీలించింది. అప్రెంటిస్‌షిప్‌ కార్యక్రమాలు సంఘటిత శ్రామికశక్తిలో మహిళలు పాల్గొనే చేస్తున్నాయని.. ఐటీ, బీపీఎం, రిటైల్, ఆటోమోటివ్, ఎల్రక్టానిక్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, పర్యాటకం, ఆతిథ్యం, ఆహార శుద్ధి, లైఫ్‌ సైన్సెస్, లాజిస్టిక్స్, హెల్త్‌కేర్‌ రంగాల్లో వారి ప్రాతినిధ్యం పెరుగుతోందని ఈ నివేదిక వెల్లడించింది.   

హైదరాబాద్‌ టాప్‌ 
మహిళా అప్రెంటిస్‌లలో 2024లో 42 శాతం మందికి హైదరాబాద్‌ కేంద్రంగా నిలిచింది. ఆ తర్వాత కోల్‌కతా, చెన్నైలోనూ వీరి భాగస్వామ్యం పెరిగింది. అయితే అప్రెంటిస్‌షిప్‌ కార్యక్రమాల్లో మహిళలు పాల్గొనే విషయమై కొన్ని సంస్థలు సవాళ్లను చూస్తున్నాయి. 38 శాతం సంస్థల్లో అసలు మహిళా అప్రెంటిస్‌లే లేరు. మరో 26 శాతం సంస్థల్లో వీరి భాగస్వామ్యం 1–10 శాతం మించి లేదని టీమ్‌లీజ్‌ నివేదిక ఆధారంగా తెలుస్తోంది.   
  
కేవలం 2 శాతం సంస్థల్లోనే మహిళల ప్రాతినిధ్యం 50 శాతాన్ని మించడం గమనార్హం. కనుక మహిళలు మరింత పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు లకి‡్ష్యత కార్యక్రమాలు, స్థిరమైన దృష్టి అవసరమని ఈ నివేదిక అభిప్రాయపడింది. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ జీడీపీలో వారి వాటా 18 శాతంగానే ఉందని, అందులోనూ అధిక శాతం మహిళలు సంఘటిత ఉపాధికి బయట ఉన్నట్టు ఈ నివేదిక ఎత్తి చూపింది. పైగా పనిచేసే వయసులోని మహిళల్లో 60 శాతం మంది అసలు పాలు పంచుకోవడం లేదు. 15–29 ఏళ్ల వయసు మహిళల్లో శ్రామిక భాగస్వామ్య రేటు 29 శాతంగానే ఉంది. 

అదే 15–59 ఏళ్ల వయసు వారిలో ఇది 45 శాతంగా, మొత్తం మీద అన్ని వయసుల్లోని మహిళల్లో 31.7 శాతం మించిలేదు. 2047 నాటికి మహిళ కారి్మకుల సంఖ్య 25.5 కోట్లకు చేరుకుంటుందని.. 

వీరి భాగస్వామ్యం 45 శాతానికి పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. ‘‘అప్రెంటిస్‌షిప్‌ కార్యక్రమాల్లో మహిళలు చేరడం గత మూడేళ్లలో 58 శాతం పెరిగింది. అయినప్పటికీ మొత్తం అప్రెంటిస్‌లలో వీరి వాటా 20 శాతంకంటే తక్కువగానే ఉంది. అంటే గణనీయమైన శక్తి సామర్థ్యాలను ఇంకా వెలుగుతీయాల్సి ఉంది’’అని టీమ్‌లీజ్‌ డిగ్రీ అప్రెంటిస్‌షిప్‌ సీఈవో నిపున్‌ శర్మ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement