ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి తీపికబురు చెప్పిన నితిన్ గడ్కరీ

Within two years cost of petrol vehicle, EV will be same: Nitin Gadkari - Sakshi

న్యూఢిల్లీ: రాబోయే రెండేళ్లలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) ధర పెట్రోల్ వాహనాల స్థాయికి చెరనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. "రాబోయే రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ వేరియెంట్లతో సమానంగా ఉంటుంది. ఇప్పటికే ఈవీలపై జీఎస్‌టీ కేవలం 5% మాత్రమే ఉంది. లిథియం అయాన్ బ్యాటరీల ఖర్చు కూడా తగ్గుతోంది. అంతేగాకుండా, పెట్రోల్ పంపులు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది" అని గడ్కరీ డెన్మార్క్ దేశ రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనాలపై ది సస్టైనబిలిటీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు.

"భారత దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ మంచి ఊపు అందుకుంది. పెట్రోల్ వాహనం కిలోమీటరు ప్రయాణించడానికి ₹10, డీజిల్ వాహనం కిలోమీటరు ప్రయాణించడానికి ₹7 ఖర్చు అయితే, అదే ఈవీలు కిలోమీటరు ప్రయాణించడానికి ₹1 ఖర్చు అవుతుంది" అని ఆయన అన్నారు. 2030 నాటికిఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) అమ్మకాలు ప్రైవేట్ కార్ల అమ్మకాలలో 30%, వాణిజ్య వాహనాల అమ్మకాలలో 70%, బస్సుల అమ్మకాలలో 40%, ద్విచక్ర & త్రిచక్ర వాహనాల అమ్మకాలలో 80% చేరుకోవాలని భారతదేశం లక్ష్యాన్ని పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో 2/3 ఎలక్ట్రిక్-కార్ వేరియెంట్ల ధర ₹15లక్షల కంటే తక్కువగా ఉంది. కేంద్రం సబ్సిడీ అందించిన తర్వాత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల ధర ఇప్పటికే ఉన్న పెట్రోల్ వాహనాలతో సమానంగా ఉంది అని అన్నారు.

పెట్రోల్ స్టేషన్లలో ఛార్జింగ్ పాయింట్లు
ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేలో ఎలక్ట్రిక్ హైవే వ్యవస్థను ఏర్పాటు చేయడానికి పైలట్ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారు, ఈ ప్రాంతంలో సమృద్ధిగా సౌర శక్తి శక్తిని ఉపయోగించి విద్యుదీకరణ చేయవచ్చు. దీనితో పాటు పెట్రోల్ స్టేషన్లలో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) 2023 నాటికి దేశంలోని జాతీయ రహదారులలో వెంట కనీసం 700 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే ప్రణాళికను రూపొందించింది. వీటిని ప్రతి 40-60 కిలోమీటర్లకు ఒకటి ఏర్పాటు చేయనున్నారు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు సౌరశక్తి ద్వారా విద్యుత్తును పొందేలా చూడటంపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించిందని కేంద్ర మంత్రి తెలిపారు. త్వరలో దేశంలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.

"బొగ్గు ఆధారిత విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో ప్రయోజనం లేదు. సౌర, టైడల్, పవన శక్తి, బయోమాస్ వంటి పునరుత్పాదక వనరులపై మా దృష్టి ఇప్పుడు ఉంది. రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ద్వారా డొమెస్టిక్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయవచ్చు. దేశవ్యాప్తంగా కిడబ్ల్యుహెచ్ సగటు రిటైల్ విద్యుత్ ఛార్జ్ ధర ₹7-8 వరకు ఉంది, అదే డీజిల్ జనరేటర్ విద్యుత్ ₹20/కెడబ్ల్యుహెచ్ ఉంది. కానీ, సౌరశక్తి విద్యుత్ ధర నేడు ₹2/కెడబ్ల్యుహెచ్ కంటే తక్కువగా ఉంది. కాబట్టి, రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ సోలార్ పవర్ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల తలెత్తే విద్యుత్ సమస్యను పరిష్కరించగలదు" అని ఆయన అన్నారు.

ఈవీల ఎగుమతి దేశంగా ఇండియా
ప్రస్తుతం, భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని(145 జీడబ్ల్యు) కలిగి ఉంది. సోలార్ పివీ సెల్స్, ఇళ్ల వద్ద ప్యానెల్ సిస్టమ్, మాల్స్, పార్కింగ్ స్థలాలు, కార్యాలయాల ద్వారా దేశీయ ఈవి ఛార్జింగ్ ధరలను మరింత చౌకగా మారుస్తుందని గడ్కరీ అన్నారు. గత రెండేళ్లలో ఈ-స్కూటర్లు, ఈ-కార్ట్ లు, ఈ-ఆటోలు, ఈ-సైకిళ్లు వంటి చిన్న బ్యాటరీతో నడిచే వాహనాలకు దేశంలో భారీగా డిమాండ్ పెరిగిందని గడ్కరీ తెలిపారు. ఎలక్ట్రిక్ టూ వీలర్, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు కోవిడ్ పూర్వ కాలంతో పోలిస్తే వరుసగా 145%, 190% పెరుగుదలను చూశాయి అని ఆయన అన్నారు. ఈ రెండు సెగ్మెంట్లలో భారతదేశం ఎగుమతిదారుగా మారే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top