Windfall tax reimposed on local crude oil, diesel export duty removed - Sakshi
Sakshi News home page

Windfall tax: మళ్లీ ‘విండ్‌ఫాల్‌’ బాదుడు!

Apr 20 2023 7:32 AM | Updated on Apr 20 2023 10:17 AM

Windfall tax reimposed on local crude oil - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ను ప్రభుత్వం తిరిగి విధించింది. తాజా ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం... ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై  టన్నుకు రూ.6,400 విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను విధించడం జరిగింది. బుధవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.

ఏప్రిల్‌ 4న జరిగిన గత చివరి సమీక్షలో దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్‌ పన్నును పూర్తిగా (జీరో స్థాయి) తొలగించడం జరిగింది.  అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్‌కు 75 డాలర్లకంటే తక్కువకు పడిపోవడం దీని నేపథ్యం. అయితే ఉత్పత్తిదారుల ఒపెక్‌ గ్రూప్, రష్యా వంటి దాని మిత్రపక్షాలు అనూహ్యంగా ప్రకటించిన ఉత్పత్తి ‘కోత’ నిర్ణయంతో చమురు ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. దీనితో తిరిగి విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ విధిస్తూ, ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.  

డీజిల్, ఏటీఎఫ్‌ ఎగుమతులపై జీరో.. 
కాగా,  డీజిల్‌ ఎగుమతిపై విధించే లెవీని మాత్రం పూర్తిగా తొలగించింది. ఇప్పటి వరకూ లీటర్‌కు ఈ పన్ను 0.50గా అమలవుతోంది. విమాన ఇంధనం ఏటీఎఫ్‌ ఎగుమతులపై కూడా జీరో పన్ను విధానం కొనసాగుతోంది. భారత్‌ 2022 జూలై 1వ తేదీన  విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది.  చమురు ఉత్పత్తిదారులు ప్రతి బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే ఎక్కువ ధరను పొందే సందర్భంలో వారు పొందే విండ్‌ఫాల్‌ లాభాలపై ప్రభుత్వం పన్ను విధింపు దీని లక్ష్యం.  తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల  ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది.  

అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. దేశీయ చమురు అన్వేషణకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఈ పన్నును రద్దు చేయాలని ఫిక్కీ వంటి పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.  క్రూడ్‌ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతులపై విధించిన ఈ ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకం (ఎస్‌ఏఈడీ) వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఖజానాకు దాదాపు రూ.40,000 కోట్ల ఆదాయం లభించింది. దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ ద్వారా 2023–24లో దాదాపు రూ.15,000 కోట్ల ఆదాయం వస్తుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement