సీనియర్‌ సిటిజన్లు ట్యాక్స్‌ కట్టాల్సిన అవసరం లేదా? | Will senior citizens above 75 no longer have to pay taxes Govt clarifies | Sakshi
Sakshi News home page

సీనియర్‌ సిటిజన్లు ట్యాక్స్‌ కట్టాల్సిన అవసరం లేదా? క్లారిటీ ఇదే..

Dec 29 2024 9:11 PM | Updated on Dec 29 2024 9:15 PM

Will senior citizens above 75 no longer have to pay taxes Govt clarifies

‘దేశంలో 75 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లు ఎలాంటి ట్యాక్స్‌ కట్టాల్సిన అవసరం లేదు’ ఇది సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న ఓ వార్త. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇలాంటి చాలా వార్తలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు లేదా సందేహాస్పదమైన న్యూస్ పోర్టల్‌లలో ఇటీవల ఎక్కువ‍య్యాయి. వీటిలో చాలా మటుకు ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచారమే ఉంటోంది.

తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇకపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆ వార్త సారాంశం. "కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటన - వీళ్లు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు" అని సోషల్ మీడియా సందేశం పేర్కొంది.

“భారతదేశంలోని సీనియర్ సిటిజన్లు పెన్షన్, ఇతర పథకాల ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, సీనియర్ సిటిజన్లు ఇకపై వారి ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వారు ఎలాంటి ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయాల్సిన అవసరం లేదు’’ అని అందులో రాసుకొచ్చారు.

అయితే ఇది ఫేక్‌ వార్త అని, అందులో పేర్కొన్న దాంట్లో నిజం లేదని ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం (PIBFactCheck) తేల్చింది. 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయానికి సంబంధించి మాత్రమే ఐటీఆర్‌ (ITR) (సెక్షన్ 194P ప్రకారం) ఫైల్ చేయడం నుండి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇతర పన్ను వర్తించే అన్ని ఆదాయాలపైనా ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement