కేంద్ర బడ్జెట్‌ 2026: పన్ను రాయితీలు కల్పించాలి | Union Budget 2026 Exporters Seek Tax Relief Customs Duty Rationalisation | Sakshi
Sakshi News home page

కేంద్ర బడ్జెట్‌ 2026: పన్ను రాయితీలు కల్పించాలి

Jan 23 2026 7:39 AM | Updated on Jan 27 2026 11:11 AM

Union Budget 2026 Exporters Seek Tax Relief Customs Duty Rationalisation

న్యూఢిల్లీ: వచ్చే బడ్జెట్‌లో తమకు పన్నుల్లో రాయితీలు కల్పించాలని, సుంకాలను క్రమబద్దీకరించాలని, అంతర్జాతీయంగా బ్రాండింగ్, మార్కెటింగ్‌కు సహకారం అందించాలని ఎగుమతి దారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇన్వర్టెడ్‌ కస్టమ్స్‌ డ్యూటీ స్ట్రక్చర్‌ పరంగా ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

తుది ఉత్పత్తుల కంటే విడిభాగాలు, ముడి సరుకులపై పన్ను రేట్లు అధికంగా ఉండడాన్ని ఇన్వర్టెడ్‌ కస్టమ్స్‌ డ్యూటీ స్ట్రక్చర్‌గా చెబుతారు. ఎగుమతులకు ఉద్దేశించిన కీలక విడిభాగాలు, ముడి సరుకుల దిగుమతులపై సుంకాలను క్రమబద్దీకరించాలని, దీనివల్ల తయారీ వ్యయాలు దిగొస్తాయని ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) పేర్కొంది. తుది వ్రస్తాల కంటే సింథటిక్‌ యార్న్, ఫైబర్‌పై కస్టమ్స్‌ డ్యూటీ అధికంగా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఇది టెక్స్‌టైల్‌ వ్యాల్యూ చైన్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని పేర్కొంది.

అలాగే, ఎల్రక్టానిక్స్‌ తుది ఉత్పత్తుల కంటే ఎలక్టాన్రిక్స్‌ విడిభాగాలైన ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులు, కనెక్టర్లు, సబ్‌ అసెంబ్లీలపై అధిక సుంకాలు పడుతున్నాయంటూ.. ఇది దేశీయంగా వ్యాల్యూ చైన్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు వివరించింది. కెమికల్, ప్టాస్టిక్స్‌ రంగంలోనూ ముడి పదార్థాలలైన కెమికల్స్, పాలీమర్స్‌పై అధికంగా సుంకాలు అమలవుతున్నాయని, లెదర్‌ పరిశ్రమలోనూ ఇదే విధానం ఉన్నట్టు తెలిపింది.

‘‘కనుక ముడి సరుకులపై సుంకాలను తగ్గించడం ద్వారా ఈ లోపాలకు చెక్‌ పెట్టాలి. దీనివల్ల తయారీ వ్యయాలు తగ్గుతాయి. మూలధన నిధుల పరంగా ఒత్తిళ్లు తగ్గుతాయి. దేశీ తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. భారత ఎగుమతుల పోటీతత్వం పెరుగుతుంది’’అని ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ ఎస్‌సీ రల్హాన్‌ పేర్కొన్నారు.

ప్రపంచస్థాయి షిప్పింగ్‌ లైన్స్‌.. 
ప్రపంచ స్థాయి షిప్పింగ్‌ లైన్స్‌ (ఆపరేటర్లు) అభివృద్ధికి విధానపరమైన, ద్రవ్యపరమైన మద్దతు అందించాలని ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ రల్హాన్‌ కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం విదేశీ షిప్పింగ్‌ లైన్స్‌పై ఆధారపడడం వల్ల రవాణా కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తున్నట్టు చెప్పారు. సరఫరా వ్యవస్థలో సమస్యలను, రవాణా చార్జీల్లో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు తెలిపారు.

ఇక కొత్త తయారీ యూనిట్లకు 15 శాతం రాయితీ కార్పొరేట్‌ పన్ను రేటును మరో ఐదేళ్ల కాలానికి పొడిగించాలని కూడా కోరారు. రాయితీ రేట్లపై రుణాలను అందించాలని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) కేంద్రానికి సూచించింది. టెక్స్‌టైల్‌ మెషినరీపై జీఎస్‌టీని తగ్గించాలని, చిన్న యూనిట్లకు టెక్నాలజీ నవీకరణ కోసం పథకాన్ని ప్రకటించాలని ఏఈపీసీ చైర్మన్‌ శక్తివేల్‌ డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement