రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA).. రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కీలక తేదీలను ఆమోదించింది. పార్లమెంట్ క్యాలెండర్ ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఆదివారం నాడు 2026-27 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో దేశ చరిత్రలో ఆదివారం ప్రవేశపెట్టడం ఇది రెండోసారి కానుంది.
బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి గుర్తుగా.. జనవరి 28న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. కాగా జనవరి 29న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి సెషన్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 తేదీలలో జరుగుతుందని, రెండవ భాగం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 మధ్య రెండో సెషన్ జరుగుతాయి.
సీతారామన్ తొమ్మిదో బడ్జెట్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు.
ఇది రెండోసారి..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు.. 2025 బడ్జెట్ను సమర్పించిన సంగతి తెలిసిందే. గతంలో.. అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2015లో ఫిబ్రవరి 28న శనివారం, 2016లో ఫిబ్రవరి 28న ఆదివారం కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు.


