ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మోసం.. రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్! | IDFC First Bank concall by V. Vaidyanathan addressed Rs 590 crore fraud case | Sakshi
Sakshi News home page

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మోసం.. రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్!

Feb 23 2026 1:49 PM | Updated on Feb 23 2026 2:08 PM

IDFC First Bank concall by V. Vaidyanathan addressed Rs 590 crore fraud case

ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్‌ రంగ సంస్థ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్‌లోని ఒక శాఖలో భారీ ఆర్థిక అక్రమాలు వెలుగుచూశాయి. హరియాణా ప్రభుత్వ రంగానికి చెందిన సుమారు రూ.590 కోట్ల నిధులకు సంబంధించి జరిగిన మోసపూరిత వ్యవహారంపై బ్యాంక్ యాజమాన్యం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ ఉదంతంపై స్పందించిన బ్యాంక్ ఎండీ, సీఈఓ వి.వైద్యనాథన్.. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అసలేం జరిగింది?

హరియాణా ప్రభుత్వంలోని ఒక నిర్దిష్ట విభాగం తమ ఖాతాను మూసివేసి నిధులను మరో బ్యాంకుకు బదిలీ చేయాలని కోరడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న బ్యాలెన్స్‌కు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌కు మధ్య రూ.590 కోట్ల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. చండీగఢ్‌లోని ఒక బ్రాంచ్‌లో కొందరు ఉద్యోగులు బయటి వ్యక్తులతో కుమ్మక్కై ఈ అనధికార లావాదేవీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

బ్యాంక్ తక్షణ చర్యలు

ఈ మోసంతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న నలుగురు బ్యాంకు అధికారులను తక్షణమే సస్పెండ్ చేశారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, రికవరీ ప్రక్రియ ప్రారంభమైనట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ కుంభకోణం మూలాలను, పూర్తి స్థాయి దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి స్వతంత్ర సంస్థ కేపీఎంజీని ఫోరెన్సిక్ ఆడిటర్లుగా నియమించారు.

అన్నీ తెలుసుకుంటాం: వి.వైద్యనాథన్

సోమవారం ఉదయం జరిగిన కాన్‌కాల్‌లో వైద్యనాథన్ మాట్లాడుతూ.. బ్యాంక్ విలువలకు, పారదర్శకతకు కట్టుబడి ఉందన్నారు. ‘గత ఐదేళ్లలో 1,050 పైగా శాఖలను ప్రారంభించాం. కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదు. ఇది దురదృష్టకరం. వ్యవస్థలోని లోపాలను లేదా ఉద్యోగుల కుమ్మక్కును గుర్తించడానికి బ్యాంక్‌లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాం. బోర్డు మార్గదర్శకత్వంలో ఈ సమస్యను అత్యంత నైతికంగా, నిర్ణయాత్మకంగా పరిష్కరిస్తాం’ అని చెప్పారు.

నిన్న రాత్రి దేశవ్యాప్తంగా తమ బ్యాంకు ఉద్యోగులతో మాట్లాడానని, బ్యాంక్ కార్యకలాపాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయని ఆయన భరోసా ఇచ్చారు. సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఎవరికీ ఇందులో ప్రమేయం లేదని, సాధారణ బ్యాంకింగ్ లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఆర్థిక ప్రభావం అంచనా

ఈ మోసం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని నిర్ధారించే పనిలో బ్యాంక్ ఉంది. ఇతర బ్యాంకుల్లో ఉన్న మోసపూరిత లబ్ధిదారుల ఖాతాలను గుర్తించడం, చట్టపరమైన రికవరీల ద్వారా వచ్చే నిధుల ఆధారంగా తుది ప్రభావాన్ని నిర్ణయిస్తారు. ఈ నష్టాన్ని బ్యాంక్ తన ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ ఖాతా ద్వారా సర్దుబాటు చేయనుంది.

డిసెంబర్ 2018లో క్యాపిటల్ ఫస్ట్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ విలీనం తర్వాత వి.వైద్యనాథన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి బ్యాంక్ వేగంగా వృద్ధి సాధిస్తున్న తరుణంలో ఈ మోసం బయటపడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనా చట్ట ప్రకారం బాధ్యులపై కఠినమైన సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని బ్యాంక్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తేల్చి చెప్పింది.

ఇదీ చదవండి: పదిలంగానే అమెరికా వాణిజ్య ఒప్పందాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement