మోర్తాడ్(బాల్కొండ): యూఏఈలో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు మరోసారి ఉచిత వీసాలను ఇప్పించేందుకోసం యూఏఈకి చెందిన ఏడీఎన్హెచ్, మన దేశానికి చెందిన జీటీఎం సంస్థలు రిక్రూట్మెంట్ మేళా నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాయి. క్లీనింగ్ విభాగంలో 300 మందికి ఉచిత వీసాలు ఇచ్చేందుకు ఈనెల 12న సిరిసిల్ల, జగిత్యాల, 13న నిజామాబాద్, ఆర్మూర్లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
21 ఏళ్ల వయసు నిండి 40 సంవత్సరాలలోపు వారు ఈ ఇంటర్వ్యూలకు అర్హులు. ఎంపికైన వారికి ఉచితంగా వీసాలు ఇచ్చి, విమాన చార్జీలను సైతం కంపెనీయే భరించనుంది. భారత కరెన్సీలో నెలకు రూ.24 వేల వేతనం చెల్లిస్తూ.. నివాసం, భోజన సదుపాయాన్ని ఏడీఎన్హెచ్ కంపెనీ సమకూర్చనుంది. వివరాల కోసం సిరిసిల్ల 83320 17122, జగిత్యాల 83320 42299, నిజామాబాద్ 86868 60999, ఆర్మూర్ 83320 13999 నంబర్లలో సంప్రదించాలి.
ఈ సందర్భంగా జీటీఎం సంస్థ చైర్మన్ సతీష్రావు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఉచితంగా వీసాలు జారీ చేసే అవకాశం తమ సంస్థకు రావడం ఎంతో విశేషం అన్నారు. వలస వెళ్లేవారిపై నయాపైసా భారం లేకుండా అన్ని వసతులు ఉచితంగా సమకూర్చడం తమ ప్రత్యేకత అని చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


