
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ తమ నెదర్లాండ్స్ ప్లాంటు కార్యకలాపాలను క్రమబదీ్ధకరించుకునే క్రమంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది. మేనేజ్మెంట్, సపోర్ట్ విధులకు సంబంధించి 1,600 ఉద్యోగాల్లో కోత విధించనున్నట్లు సంస్థ తెలిపింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని, మార్జిన్లను మెరుగుపర్చుకోవడానికి, వ్యయాలు తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది.
స్థానిక మేనేజ్మెంట్ బోర్డులో కూడా కొన్ని మార్పులు, చేర్పులు చేయనున్నట్లు పేర్కొంది. ఈ విషయాలను సెంట్రల్ వర్క్స్ కౌన్సిల్తో పాటు ట్రేడ్ యూనియన్లకు కూడా తెలియజేసినట్లు కంపెనీ వివరించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో నెదర్లాండ్స్ ప్లాంటు 6.75 మిలియన్ టన్నుల లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి చేసింది.
భౌగోళిక.. రాజకీయ పరిణామాల వల్ల యూరప్లో డిమాండ్ నెమ్మదించడం, వాణిజ్యం.. సరఫరా వ్యవస్థల్లో అవాంతరాలు ఏర్పడటం తదితర అంశాలు నిర్వహణ వ్యయాలపైనా, అంతిమంగా ఆర్థిక పనితీరుపైనా ప్రభావం చూపాయి. నెదర్లాండ్స్ ప్లాంటులో హరిత టెక్నాలజీలను అమల్లోకి తేవడానికి కట్టుబడి ఉన్నట్లు టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ దశాబ్దం ఆఖరు నాటికి రెండు బ్లాస్ట్ ఫర్నేస్ల స్థానంలో అధునాతన పర్యావరణహిత ఫర్నేస్లను ఏర్పాటు చేయనున్నట్లు, దీనితో ఏటా 5 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నట్లు వివరించారు.