
గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ సంస్థ
పెరుగుతున్న బంగారం ధరలకు అనుగుణంగా టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బంగారు ఆభరణాల రిటైల్ బ్రాండ్ తనిష్క్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు తమ పాత బంగారానికి గరిష్టంగా 2 క్యారెట్ల అదనపు విలువ పొందేందుకు వీలు కల్పిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ పరిమిత కాల ఆఫర్ జూన్ 30, 2025 వరకు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.
ఆఫర్ ఎలా పనిచేస్తుందంటే..
పాత బంగారాన్ని మార్పిడి చేసుకునే కస్టమర్లు కొత్త ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు అదనపు క్యారెట్ విలువను పొందేలా ఈ ఆఫర్ను డిజైన్ చేశారు. ప్లేయిన్ జ్యువెలరీ లేదా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు పాత బంగారం విలువపై 1 క్యారెట్ అదనంగా పొందవచ్చు. అదే వజ్రాలతో కూడిన ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు పాత బంగారం విలువపై 2 క్యారెట్లను అదనంగా పొందేందుకు ఈ ఆఫర్ ద్వారా వీలు కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి: తగ్గిన ఇంధన వాడకం
కస్టమర్ల పాత బంగారం 20 క్యారెట్లు ఉండి దాన్ని ఎక్స్ఛేంజ్ ఇచ్చి తిరిగి కొత్త బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటే పాత దాన్ని 21 క్యారెట్లుగా లెక్కిస్తారు. అదే వజ్రాభరణాలను కొనుగోలు చేసేటప్పుడు 22 క్యారెట్లుగా విలువ కడుతారు. బంగారం ధరలు పెరుగుతున్నందున ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా తనిష్క్ ప్రీమియం డిజైన్లను పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. పండుగలు, పెళ్లిళ్లు లేదా వ్యక్తిగతంగా తమ ఆభరణాలు కొత్త డిజైన్లలోకి మార్చుకోవాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది.