నాలుగేళ్ల ఆంక్షలు ఎత్తివేత! | Sri Lanka set to lift its vehicle import ban in a phased manner starting from October 1 | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లుగా ఉన్న ఆంక్షలు ఎత్తివేత!

Sep 16 2024 12:48 PM | Updated on Sep 16 2024 12:48 PM

Sri Lanka set to lift its vehicle import ban in a phased manner starting from October 1

వాహన దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక ప్రకటించింది. అక్టోబర్‌ 1, 2024 నుంచి వివిధ దశల్లో ఈ నిర్ణయం అమలవుతుందని పేర్కొంది. కరోనా సమయంలో ఆర్థిక సంక్షోభానికి గురైన శ్రీలంక 2020లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాహనాలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. 2022లో సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. దాంతో స్థానిక ప్రభుత్వం రద్దయింది. దానికితోడు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వంటి భౌగోళిక అనిశ్చితులు నెలకొన్నాయి. తర్వాత శ్రీలంకలో ఇతర పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. క్రమంగా స్థానిక ఆర్థిక పరిస్థితులు గాడినపడుతున్నాయి.

ఐఎంఎఫ్‌ ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ప్రోగ్రామ్‌ నిబంధనల్లో భాగంగా దేశీయంగా వివిధ దశల్లో వాహన దిగుమతులు పెంచాలని శ్రీలంక నిర్ణయించింది. మొదట దశలో అక్టోబర్‌ 1, 2024న ప్రజా రవాణా వాహనాలు, రెండో దశ కింద డిసెంబర్‌ 1, 2024 నుంచి వాణిజ్య వాహనాలు, మూడో దశ ఫిబ్రవరి 1, 2025 నుంచి ప్రైవేట్‌ మోటార్‌ వాహనాల దిగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే విదేశీ మారక నిల్వల నిర్వహణకు మాత్రం అదనపు కస్టమ్స్ సుంకాలు విధిస్తామని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఏప్రిల్ 2022లో భారీగా క్షీణించిన విదేశీ మారక నిల్వలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తుంది.

ఇదీ చదవండి: ఐదు లక్షల మంది రైతులకు సాయం

భారత్‌లో వాహన తయారీ కంపెనీలైన మారుతీసుజుకీ, టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టీవీఎస్‌ మోటార్స్‌..వంటి కంపెనీలకు శ్రీలంక ప్రభుత్వ నిర్ణయంతో మేలు జరగనుంది. ఆ దేశానికి ఎక్కువగా ఈ కంపెనీలు వాహనాలు సరఫరా చేస్తుంటాయి. దాంతో రానున్న రోజుల్లో కంపెనీల రెవెన్యూ పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement