స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా ? క్యూ 3లో లిస్టింగ్‌ కంపెనీల రిజల్ట్స్‌

Some Of Listing Companies Q3 Results To Guide New Investors - Sakshi

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌పై సామాన్యులకు ఆసక్తి పెరిగింది. రాబడుల కోసం షేర్‌ మార్కెట్‌వైపు చూస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇన్వెస్ట్‌ చేసే ముందు ఆయా కంపెనీల పనితీరు తెలుసుకోవడం మంచిదని మార్కెట్‌ నిపుణులు ఎప్పుడూ సూచిస్తుంటారు.  సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలను కంపెనీలు వరుసగా ప్రకటిస్తున్నాయి. అందులో కొన్ని లిస్టింగ్‌ కంపెనీల పనితీరు వివరాలు ఇలా ఉన్నాయి.


పిరమల్‌... వీక్‌ 
స్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో డైవర్సిఫైడ్‌ దిగ్గజం పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 32 శాతం క్షీణించి రూ. 426 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 628 కోట్లు ఆర్జించింది. ఫైనాన్షియల్‌ సర్వీసుల విభాగం ప్రధానంగా ఫలితాలను దెబ్బతీసినట్లు కంపెనీ తెలియజేసింది. ఫార్మా విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు అక్టోబర్‌లో బోర్డు అనుమతించినట్లు కంపెనీ వివరించింది. 


ఫార్మా జోరు 
ఫార్మా విభాగం ఆదాయం రూ. 1,441 కోట్ల నుంచి రూ. 1,621 కోట్లకు ఎగసింది. ఫైనాన్షియల్‌ సర్వీసుల అమ్మకాలు మాత్రం రూ. 1,861 కోట్ల నుంచి రూ. 1,484 కోట్లకు తగ్గాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కొనుగోలు లావాదేవీకి రూ. 143 కోట్లు వెచ్చించినట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో రూ. 153 కోట్లమేర అనుకోని వ్యయాలు నమోదైనట్లు తెలియజేసింది. 
ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్‌ఈలో దాదాపు 4 శాతం పతనమై రూ. 2,714 వద్ద ముగిసింది.


గోద్రెజ్‌ కన్జూమర్‌... ప్లస్‌ 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం గోద్రెజ్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 479 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 458 కోట్లు ఆర్జించింది. నికర అమ్మకాలు మరింత వృద్ధితో 9 శాతం ఎగసి రూ. 3,144 కోట్లకు చేరాయి. అయితే మొత్తం వ్యయాలు సైతం 11 శాతం పెరిగి రూ. 2,579 కోట్లను తాకాయి. దేశీ బిజినెస్‌ 9 శాతంపైగా వృద్ధితో రూ. 1,838 కోట్లను అధిగమించగా.. ఇండొనేసియా మార్కెట్‌ నుంచి ఆదాయం యథాతథంగా రూ. 445 కోట్లుగా నమోదైంది. ఆఫ్రికా నుంచి అమ్మకాలు 15 శాతం జంప్‌చేసి రూ. 748 కోట్లను దాటాయి. ఇతర మార్కెట్ల నుంచి మాత్రం ఆదాయం 4 శాతం నీరసించి రూ. 174 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్‌ఈలో 2.5% నష్టంతో రూ. 953 వద్ద ముగిసింది.


బజాజ్‌ హిందుస్తాన్‌... నష్టాలు తగ్గాయ్‌
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో షుగర్‌ తయారీ కంపెనీ బజాజ్‌ హిందుస్తాన్‌ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర నష్టం 29 శాతం తగ్గి రూ. 113 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 160 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 14 శాతం క్షీణించి రూ. 1,344 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 1,570 కోట్ల ఆదాయం సాధిం చింది. ప్రభుత్వ రంగ సంస్థ పీఎన్‌బీకి చెందిన రమణి రంజన్‌ మిశ్రాను నామినీ డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు బజాజ్‌ హిందుస్తాన్‌ పేర్కొంది.  ఫలితాల నేపథ్యంలో బజాజ్‌ హిందుస్తాన్‌ షేరు బీఎస్‌ఈలో 0.7 శాతం బలపడి రూ. 14.7 వద్ద ముగిసింది.


ఐబీ హౌసింగ్‌ లాభం... డౌన్‌ 
ముంబై: మార్టిగేజ్‌ కంపెనీ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్‌(క్యూ2) లో నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 286 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 323 కోట్లు ఆర్జించింది. ఈ కాలంలో ఇతర సంస్థలతో ఒప్పందాల నేపథ్యంలో రూ. 325 కోట్ల రుణాలను విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది. వీటిని డిసెంబర్‌కల్లా రూ. 500 కోట్లకు, 2022 మార్చికల్లా రూ. 800 కోట్లకు పెంచుకునే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. రిటైల్‌ రుణాల విడుదలకు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యస్‌ బ్యాంక్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్‌ తదితరాలతో చేతులు కలిపినట్లు పేర్కొంది. క్యూ2లో స్థూల ఎన్‌పీఏలు 2.21 శాతం నుంచి 2.69 శాతానికి పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్‌ఈలో 3.4% పతనమై రూ. 237 వద్ద ముగిసింది.


ఆర్సెలర్‌ మిట్టల్‌... టర్న్‌ఎరౌంట్‌
గ్లోబల్‌ స్టీల్‌ దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్‌ ఈ ఏడాది(2021) మూడో త్రైమాసికంలో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్‌(క్యూ3)లో 462.1 కోట్ల డాలర్ల(రూ. 34,430 కోట్లు) నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020) ఇదే కాలంలో 26.1 కోట్ల డాలర్ల నికర నష్టం ప్రకటించింది. కంపెనీ జనవరి–డిసెంబర్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. కాగా.. క్యూ3లో మొత్తం ఆదాయం 13.3 బిలియన్‌ డాలర్ల నుంచి 20.2 బిలియన్‌ డాలర్లకు జంప్‌చేసింది. స్థూల రుణభారం బిలియన్‌ డాలర్లు తగ్గి 8.2 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ కాలంలో షిప్‌మెంట్స్‌ 17.5 మిలియన్‌ టన్నుల నుంచి తగ్గి 14.6 ఎంటీకి పరిమితమయ్యాయి. ఇందుకు ప్రధానంగా ఆటోమోటివ్‌ రంగం నుంచి బలహీనపడిన డిమాండ్, ఉత్పత్తి సమస్యలు, ఎగుమతులకు ఆర్డర్లు ఆలస్యంకావడం వంటి అంశాలు కారణమైనట్లు కంపెనీ తెలియజేసింది. ధరలు బలపడటంతో క్యూ3లో పటిష్ట ఫలితాలు సాధించినట్లు ఆర్సెలర్‌ మిట్టల్‌ సీఈవో ఆదిత్య మిట్టల్‌ పేర్కొన్నారు. దీంతో అత్యధిక లాభాలు ఆర్జించడమేకాకుండా 2008 తదుపరి కనిష్ట నికర రుణ భారాన్ని నమోదు చేసినట్లు వెల్లడించారు.


మోర్పెన్‌ ల్యాబ్స్‌...  జూమ్‌ 
హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ మోర్పెన్‌ ల్యాబ్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 38 శాతం వృద్ధితో రూ. 37 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 27 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 340 కోట్ల నుంచి రూ. 398 కోట్లకు ఎగసింది. ఏపీఐలకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిమాండ్, చైనా నుంచి సరఫరాలకు అంతరాయాలు ఏర్పడటం వంటి అంశాల నేపథ్యంలో విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేసినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ సుశీల్‌ సూరి పేర్కొన్నారు.  ఫలితాల నేపథ్యంలో మోర్పెన్‌ ల్యాబ్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.25 శాతం ఎగసి రూ. 52.5 వద్ద ముగిసింది.


జీవోసీఎల్‌కు రూ.23 కోట్ల నష్టం 
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీవోసీఎల్‌ కార్పొరేషన్‌ సెప్టెంబర్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో రూ.23 కోట్ల నష్టం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 24 కోట్ల నష్టం చవిచూసింది. టర్నోవర్‌ రూ. 132 కోట్ల నుంచి రూ. 146 కోట్లకు చేరింది. ఆర్డర్‌ బుక్‌ రూ.946 కోట్లు ఉందని జీవోసీఎల్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. 

చదవండి: ఈ షేర్లు... తారాజువ్వలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top