నేలచూపులతో నేడు మార్కెట్లు?!

SGX Nifty indicates Market may open weak today - Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 41 పాయింట్లు డౌన్‌   

మంగళవారం యూఎస్‌ మార్కెట్లు.. బేర్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో

నిఫ్టీకి 11,259-11,202 వద్ద సపోర్ట్స్‌

అమ్మకాల బాటలోనే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు(9న) నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 41 పాయింట్లు క్షీణించి 11,261 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ 11,302 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. మరోసారి టెక్నాలజీ కౌంటర్లలో భారీ అమ్మకాలు తలెత్తడంతో వరుసగా మూడో రోజు యూఎస్‌ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లన్నీ బలహీనంగా కదులుతున్నాయి. యూఎస్‌ మార్కెట్ల పతనం, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలు మళ్లీ దేశీ స్టాక్‌ మార్కెట్లను మరోసారి ఆటుపోట్లకు లోనుచేసే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 

చివర్లో అమ్మకాలు
మంగళవారం ఆద్యంతం కన్సాలిడేషన్‌ బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి డీలా పడ్డాయి. సెన్సెక్స్‌ 52 పాయింట్లు క్షీణించి 38,365 వద్ద ముగిసింది. నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 11,317 వద్ద నిలిచింది. తొలుత  సెన్సెక్స్‌ 38,746 గరిష్టాన్ని తాకగా.. 38,275 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. నిఫ్టీ సైతం 11,437- 11,290 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,259 పాయింట్ల వద్ద, తదుపరి 11,202 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,406 పాయింట్ల వద్ద, ఆపై 11,495 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,569 పాయింట్ల వద్ద, తదుపరి 22,394 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,992 పాయింట్ల వద్ద, తదుపరి 23,239 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల వెనకడుగు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1057 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 620 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు నామమాత్రంగా రూ. 7 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు సైతం రూ. 816 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇదే విధంగా గడిచిన శుక్రవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 1,889 కోట్లు, డీఐఐలు రూ. 457 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top