మార్కెట్లలో నేడు మళ్లీ ఆటుపోట్లు?!

SGX Nifty indicates Market may open in negative zone - Sakshi

24 పాయింట్లు క్షీణించిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

నిఫ్టీకి 11,374-11,277 వద్ద సపోర్ట్స్‌!

మళ్లీ రికార్డుల బాటలో యూఎస్‌ మార్కెట్లు 

ప్రస్తుతం అటూఇటుగా ఆసియా మార్కెట్లు

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు (2న) ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 24 పాయింట్లు క్షీణించి 11,504 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ 11,528 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. జీడీపీ పతనం, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాల నేపథ్యంలో ముందురోజు మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయినప్పటికీ తిరిగి నేడు ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా.. మంగళవారం యూఎస్‌ మార్కెట్లు తిరిగి చరిత్రాత్మక గరిష్టాలను అందుకోగా.. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. 

లాభాల్లోనే
మంగళవారం ఒడిదొడుకుల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 273 పాయింట్లు జంప్‌చేసి 38,901 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 83 పాయింట్లు బలపడి 11,470 వద్ద ముగిసింది. ఒక దశలో 600 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌ 39,227 వద్ద గరిష్టాన్ని తాకగా 38,542 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక ఇంట్రాడేలో నిఫ్టీ 11,554- 11,367 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,374 పాయింట్ల వద్ద, తదుపరి 11,277 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,560 పాయింట్ల వద్ద, ఆపై 11,650 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 23,457 పాయింట్ల వద్ద, తదుపరి 23,102 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 24,183 పాయింట్ల వద్ద, తదుపరి 24,555 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 486 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 775 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3,395 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 681 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top