ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలని చాలా మందికి ఉంటుంది. అయితే అందుకు వారి బడ్జెట్ సహకరించదు. ఎందుకంటే వాటి ధరలు రూ.లక్ష వరకు ఉంటాయి. ఇలాంటి కస్టమర్లకు శామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ (Samsung Galaxy S25 Edge) ఇప్పుడు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. భారత్లో ఈ ఫోన్ను గతేడాది మేలో రూ.1,09,999 ప్రారంభ ధరతో విడుదల చేసిన శామ్సంగ్, ప్రస్తుతం ఈ మోడల్పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అధికారిక లాంచ్ సమయంలో రూ.1 లక్షకు పైగా ధర కలిగిన ఈ ఫోన్, ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లలో రూ.60 వేల పరిధిలోనే లభిస్తోంది.
ప్రస్తుతం 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ.59,999కు, 512GB వేరియంట్ రూ.71,999కు అందుబాటులో ఉన్నట్లు ఆన్లైన్ ఆఫర్లు సూచిస్తున్నాయి. దీంతో అసలు లాంచ్ ధరతో పోలిస్తే దాదాపు రూ.50,000 వరకు తగ్గింపు (Samsung S25 Edge Discount) లభిస్తోంది. కొన్ని బ్యాంక్ కార్డులపై అదనపు ఇన్స్టంట్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
గెలాక్సీ S25 ఎడ్జ్ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని అల్ట్రా-స్లిమ్ డిజైన్. కేవలం 5.8 మిల్లీమీటర్ల మందం, 163 గ్రాముల బరువుతో ఇది శామ్సంగ్ గెలాక్సీ S సిరీస్లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత సన్నని ఫోన్గా గుర్తింపు పొందింది. టైటానియం ఫ్రేమ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 రక్షణతో ప్రీమియం లుక్తో పాటు మన్నికను కూడా అందిస్తోంది.

స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఇందులో 6.7 అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ ప్రాసెసర్, 12GB ర్యామ్ ఉన్నాయి. కెమెరా విభాగంలో 200 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించబడింది. అలాగే గేలాక్సీ ఏఐ ఫీచర్లు, IP68 వాటర్-డస్ట్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం సౌకర్యాలు కూడా ఉన్నాయి.
అయితే ఈ ఫోన్లో 3,900mAh బ్యాటరీ మాత్రమే ఉండటం కొంతమందికి ప్రతికూల అంశంగా భావించవచ్చు. అయినప్పటికీ, స్లిమ్ డిజైన్, ఫ్లాగ్షిప్ పనితీరు, 200MP కెమెరా కలయికను ప్రస్తుతం లభిస్తున్న తగ్గింపు ధరలో పరిశీలిస్తే, గెలాక్సీ S25 ఎడ్జ్ ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్ నుంచి ‘వాల్యూ ఫర్ మనీ ఫ్లాగ్షిప్’ కేటగిరీలోకి మారినట్లే కనిపిస్తోంది.


